పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గనుకని వైవ నాకైదువ లొడిసి, తనవేయుచేతులఁ దగులంగఁ బట్టి
వానిన గైకొని వడి వారిఁ దోలి, యానరేంద్రుడు వోయె నట పురంబునకు
నింతయు సుతునిచే నెఱిఁగి పౌలస్త్యుఁ, డెంతయుఁ జింతించి హృదయంబులోన
బరికించి మనుమునిపైఁ గూర్మికలిమి, తిరముగా మాహిష్మతీపురంబునకు
నలువార నేతెంచి నగరివాఁకిటను, వెలుఁగు భానుఁడువోలె విలసిల్లుచుండ

పులస్త్యుఁడు మాహిష్మతీపురికి వచ్చి రావణుని విడిపించుట

దౌవారికుఁడు డాసి ధరణీశుతోడ, దేవ పులస్త్యుఁ డేతెంచినాఁ డనిన
నాతతభక్తితో నయ్యర్జునుండు, చేతులు శిరముపైఁ జేర్చి మ్రొక్కుచును
అమరఁగ ముందట నర్ఘ్యపాద్యములుఁ, గొమరార ధేనువుఁ గొని పురోహితుఁడు
తనతోడ రాఁ బులస్త్యబ్రహ్మ కెదురు, సనుదెంచి చరణాంబుజంబుల కెరఁగి
యనుపమనిష్ఠతో నర్ఘ్యపాద్యములు, ననఘుఁడై యొనరించి యాగోవు నిచ్చి
యతులతేజోమూర్తి నాబ్రహ్మఁ జూచి, మతిలోన సంతోషమగ్నుఁడై పలికె
నెలకొన్న పెంపుతో నేఁడు నాపురము, పొలుపారె నమరేంద్రుపురముచందమున
నే నింద్రుఁ బోలితి నెల్లందు నాకు, మానుగాఁ గుశలంబు మది విచారింప
నేఁడు నాకుల మొప్పె నిఖలదేవతలు, పోడిగాఁ గొల్చు ని న్బూజింపఁగంటి
నేను ధన్యుఁడ నైతి నిదె రాజ్యలక్ష్మి, నానందనుల్ వీరె నాసతు ల్వీరు
యేనిదె మీకార్య మేమైనఁగాని, యానతి యిమ్మన నాపులస్త్యుండు
ధరణీశ కుశలమె ధర్మంబులందుఁ, బరికింపంగా నన్నిపరిచర్యలయఁ
బలములందును నీకుఁ బన్ను గా ననుచు, నెలమితో సంతోష మేర్పడ నడిగి
నిరుపమంబగుచున్న నీవిక్రమంబు, నురుబాహుబలమును నొప్పుఁ బేర్కొనఁగ
వ్రాలినకడిమి నెవ్వానిఁ బేర్కొన్న, గాలియు జలధులుఁ గదలంగ వెఱచు
నట్టి నామనుమని నాదశగ్రీవు, పట్టికట్టితి వీవు బవరంబులోన
మూఁడులోకంబుల మొగిఁ గీర్తి గంటి, పోడిమి నను నీదుబుద్ధి మన్నించి
రావణు విడువుము రాజేంద్ర నీవు, గావించుపూజలు గైకొందు ననిన
నగుఁ గాక నాకు నీయానతికంటె, తగ నొందుకార్యంబు దలపోయఁ గలదె
యనుచును బౌలస్త్యు నప్పుడు విడిచి, తనగౌరవం బొప్పఁ తగఁ గట్ట నిచ్చి
యురుమదోద్ధతుల నొండొరుఁ జంపకుండ, సరి నగ్నిసన్నిధి శపథముల్ సేసి
వినయంబుతో బ్రహ్మ వీడ్కొని యెలమిఁ, దనగృహంబునకు నాధరణీశుఁ డరిగెఁ
దనలోని సిగ్గునఁ దల లోలి వాంచి, తనవెన్క వచ్చు నాదశకంఠుఁ జూచి