వడిఁ గుబేరుని నాహవంబునఁ దోలి, కడిమిమై నీపుష్పకముఁ గొన్నవాఁడ
ననుడు మరుత్తుఁడు నాదశగ్రీవుఁ, గనుగొని రాక్షస కడుఁగృతార్థుఁడవు
భ్రాత నోడించితి బవరంబులోన, నీతేజ మొరులకు నేల సిద్ధించుఁ
దోయజగర్భుడు దుష్టాత్ముఁడైన, నీయట్టికొఱగాని నీడఁ బుట్టించె
నంతకుపురికి ని న్ననుతు నాయెదుర, నంతకు బదిలుండవై నిల్వు మనుచు
బాణాసనంబును బటుబాణభరిత, తూణముల్ గొని తెంపు తోరణంబునకు
నరుగంగ సంవర్తుఁ డడ్డంబు సొచ్చి, నరనాథ దీక్షితునకు నల్గరాదు
నేమంబుఁ గైకొని నిత్యైకనిష్ఠ, నీమహేశ్వరయాగ మీడేర్పవలయుఁ
గాన నిప్పుకుడు కులక్షయము వాటిల్లుఁ, గాన విక్రమవేళ గా దట్లు గాక
నెందును దుర్జయుం డీదశగ్రీవుఁ, డెందు వ్రాలునొ జయ మెఱుఁగఁగరాదు
అనిన మరుత్తుఁడు నాత్మ - జింతించి, ఘననిష్ఠ శాంతంబుఁ గైకొని మదిని
ఆకోపమున విల్లు నమ్ములు విడిచి, చేకొని జన్నంబు సేయంగ దొడఁగె
నకలంకుఁడై దైత్యుఁ డావిజయంబు, సకలదిక్కులయందుఁ జాటించి యార్చి
రోషోగ్రగతి నామరుత్తుని గెలిచె, దోషాచరేంద్రుడు తొడిబడ మునుల
సమయించి యటు వాసి చనియె దేవతలు, తమతమరూపముల్ దాల్చి రాలోన
నాకాధినాథుండు నమలి నీక్షించి, నీకలాపమున నానేత్రముల్ వేయుఁ
గలిగి క్రొమ్మేఘంబు గర్జిల్లి కురియఁ, జెలఁగి తజ్జలములు సేవింపుమనుచు
నరుదుగా వరమిచ్చె నదిమొదల్ నమలి, పురి చిత్రవర్ణమై పొలిచె లోకముల
వరుణుండు హంసకు వరమిచ్చె శుభ్ర, తరవర్ణమై మేను దనరారి వెలుఁగఁ
జన్నుగాఁ గాంచనప్రభ మేను గలుగఁ, గిన్నరాధిపుఁ డిచ్చెఁ గృకలాసమునకుఁ
గమణ నంతకుడును గాకి నీక్షించి, జరచేతఁ దెవులచేఁ జావు లేకుండ
మరణంబు నొందిన మనుజుల కెల్ల నిరవంద ధరణిపై నిడినపిండములు
తిరముగాఁ గొని వారిఁ దృప్తులఁ జేయ, వర మిచ్చినంత నధ్వరము దీరుటయు
నిజనివాసములకు నిర్జరుల్ చనఁగ, రజనీచరేంద్రుండు రణకాంక్షులైన
రావణుఁడు రాజులపై యుద్ధమునకుం బోవుట
భూతలాధీశులపురములమీఁద, నాతతోద్ధతగతి నరిగి యీనృపుల
కడిమిమై నాతోడఁ గయ్యంబు సేయఁ, గడఁగుఁ డోటమి యొండె గైకొనుఁ డనిన
ఘనుఁడైన సురథుండు గాధేయగయులు, ననవద్యతరతేజుఁడగు పురూరవుఁడు
మొదలుగాఁగల రాజముఖ్యులు పఙ్క్తి, వదను నిప్పుడు గెల్వ వశముగా దనుచు
కొనరంగ నూహించి యోడిత మనిన, విని రావణుఁడు తనవిక్రమంబునకు