పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మలగుణలోలు నెరిగుణశీలుఁ, గర్మవిదూరు లోకత్రయాధారుఁ
బురుషోత్త మాచ్యుతు బుండరీకాక్షు, చరణాబ్దముల భక్తి చాల నా కిమ్ము
పడయఠానివి లేవు పరమధర్మములు, పడయ దుర్లభమైన బ్రహ్మాస్త్ర మిచ్చి
కమలసంభవ నన్నుఁ గరుణింపుమనిన, నమర నా రెంటితో నమరత్వ మిచ్చి
గురుదయాంచితబుద్ధిఁ గుంభకర్ణునకు, వర మిచ్చువేడ్క నవ్వల నేగుదేర
ముకుళితహస్తులై ముందట నిలిచి, సకలదేవతలు నాచతురాస్యు కనిరి
వారిజాసన విూరు వరము లీవలదు, క్రూరాత్ముఁ డగుచున్న కుంభకర్ణునకు
వాఁడిమిఁ గడు వ్రాలి వరశక్తి లేని, నాఁ డుగ్రగతిలేని నందనచరుల
నచ్చనలేమల నమరకన్యకల, విచ్చలవిడిఁ బట్టి వెస మ్రింగుచుండు
మఱియును నరమునిమాంసాశి యగుచు, వెఱపించు లోకముల్ వీడు సంతతము
వరముల నిచ్చిన వాసవప్రభృతి, సురల కతఁడు మనశ్శూలంబు గాఁడె
మూఁడులోకంబులు మొగిఁ బాఱమ్రింగు, వేఁడిమి చూపఁడే వీఁ డేపు మిగిలి
యటుగాన వరరూపమగుశాప మిచ్చి, కుటిలాత్ముఁ డాతని క్రొవ్వార్పవలయు
నని విన్నవించిన నవుఁ గాక యనుచు, వనజాసనుఁడు సరస్వతిఁ దలంచుటయు
భారతియును వచ్చి పద్మజుమ్రోల, గారవంబున హస్తకమలముల్ మొగిచి
పని యేమి నావుడు పరమేష్ఠి పలికె, వనజాక్షి నీ వెల్లవారిజిహ్వలను
గల్గియుండుదు కుంభకర్ణుని జిహ్వ, నెలకొని తప్పాడు నీ వంచుఁ బనిచి
వనజాసనుఁడు వచ్చి వర మేమి వేఁడు, కొనుము నీ వనిన నాకుంభకర్ణుండు
యాఱేసినెలలు నిద్రావస్థ నుండి, తేఱుట తుది నొక్కదివసంబునందుఁ
గలుగంగ నా కిమ్ము కరుణతో ననుదుఁ, బలుక నవ్వర మిచ్చి బ్రహ్మ దాఁ జనియె
నప్పుడు వాణియు నాకుంభకర్ణు, తప్పులు బలికించి తాఁ బాసి చనఁగ
నీమాట నానోటి కేలొకో వచ్చె, నేమని వేడితి నీవరం బకట
యిరవంద నిది మున్ను హృదయంబులోనఁ, గరమర్థి దలంచిన కార్యంబు కాదు
పరికి౦ప దైవంబు ప్రతికూలమవుట, వెరవేది నాకోర్కె విపరీత మయ్యె
ననుచు విచారింప నంత రావణుఁడు, తనరుతేజముతోడ దండముల్ గొనుచు
ననుపమశ్లేషాత్మ కాహ్వయంబైన, వనములోపలి కేగి వర్తించుచుండ
వారిజాసనుచేతివరములు వడసి, వారు వచ్చుట విని వసుమతీస్థలికిఁ
బాతాళముననుండి పరివారసహితుఁ, డై తనూజులు మంత్రులగు విరూపాక్షు
శూరోత్తముని ప్రహర్షుని మహోదరుని, మారీచుఁ గొనుచు సుమాలి యేతెంచి