పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనకరాజాత్మజ నాలినమాట, విని వచ్చి చెప్పు డావిధము నా కనిన
నగు గాక యని వాఁడు నట పోయి మ్రొక్కి, జగతీశుమాట లాసంయమీంద్రునకు
వినుపింప నప్పుడు విని సంతసిల్లి, మనుజేంద్రమాటలు మాననీయములు
భావింప సతులకు పతియ దైవంబు, కావింప తనపల్కు గావింపవలయు
చనుఁడన్న వారు నాజననాథుకడకు, చనుదెంచి చెప్పి రాసత్యవాక్యములు
వారిమాటలు విని వసుమతివిభుఁడు, మీరెల్ల నెల్లి వాల్మీకియెదుర
శుద్ధిగా వైదేహి శోధింపుడనుదు, నిద్ధవాక్యంబుల నేర్పడఁ బలికి
సంతోషమున సభాసదుల వీట్కొలిపె, నంత భానుఁడు గ్రుంక నారాత్రి చనిన
మరునాఁడు కొలువుండి మహితతేజమున, వరలు వసిష్ఠుని వామదేవునిని
నోలిఁ బర్వతు బులహుని శతానందు, గాలవు కశ్యపు గార్గ్యు దూర్వాసు
చ్యవను మౌద్గల్యు విశ్వామిత్రుఁ గలశ, భవు నక్షపాదుని భార్గవు గణ్వు
సుమతి మార్కండేయు సువ్రతు శక్తి, నమరర్షిపుంగవుఁ డైన నారదుని
సకలమునీంద్రుల సకలభూపతుల, సకలవానరులను సకలరాక్షసుల
వరుస జన్నమునకు వచ్చి మున్నున్న, పరదేశములవారిఁ బౌరులఁ బ్రజల
వీరు వా రన కెల్లవిధములవారి, నారంగ రప్పించె నాస్థానమునకు
నప్పుడు తల వాంచి హస్తముల్ మొగిచి, కప్పుశోకమున గద్గదకంఠుఁ డగుచు
జనకజ వెనక రా సభకు వాల్మీకి, జనుదెంచె నట శిష్యసహితుఁడై యంత
సభవారు వైదేహి చనుదేరఁ జూచి, యభిమానవతికి నిట్లయ్యెనే యనుచు
శోకింపఁ గొందఱు జూచి యాసీత, లోకైకపావని లోకంబులోన
గంభీరు లాడెడు కలుషవాక్యములు, సంభావితములె? యీసాధ్వికి ననఁగ
నింద కోడనివాఁడు నిర్జీవి యనుచు, గొంద ఱారాముని గొనియాడుచుండ
జగతీశుధైర్యంబు జానకితెంపు, తగచూచి కొందఱు తలలూచి మెచ్చి
మేలు గావలయు భూమిజకు నా గొక్క, కోలాహలం బయ్యె కొలువులో నపుడు

వాల్మీకి రామునికి సీతావృత్తాంతంబు జెప్పి కుశలవుల నప్పగించుట

పరువడి నాకందు ప్ర్రాచేతసుండు, సంజ్ఞ విచారించి సదయుఁడై పలికె
ధరణీశ యీసీత ధర్మనిష్ణాత, పరమపతివ్రాత పావనమూర్తి
జనలోకనిందకు శంకించి నీవు, తను విసర్జించిన తగవు చింతించి
వచ్చి మాయాశ్రమవనభూమిలోన, నిచ్చలు నత్యంతనియతితో నుండి