పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యనవుఁడు విని రాముఁ డాశ్చర్య మంది, మునినాథు గనుగొని ముదితాత్ముఁ డగుచు
ననఘ నిర్జన మేటి కయ్యె నీవనము, వినుపింపవలయు నావిధము నా కనిన
మను వనుపేరిట మహనీయకీర్తి, ఘనుఁ డాదియుగమున గలఁ డొక్కరాజు
యతనికి నిక్ష్వాకుఁ డను తనూజుండు, వితతవిక్రమశాలి వెలయఁ జనించె
నతనితండ్రియు భూమి కభిషిక్తుఁ జేసి, ప్రతిదినంబున నీతి ప్రజలఁ బాలించు
ధర్మవర్తనుఁ డైన ధరణి రాజులకు, నిర్మలస్థితి గల్గు నిత్యసౌఖ్యములు
తప్పు సేయనివారి దండింపఁదగదు, తప్పు జేసినవారి దండింపవలయు
మొగి బ్రమాణాదుల మును తప్పు లరసి, తగ శాస్త్రదండంబు దండించునపుడు
నాకంబు గలుగు భూవాసుల కిట్లు, గాకున్న నరకంబు గలుగు వారలకు
పరమధర్మస్థితి బాటింపవలయు, పురుషుల కని పెక్కుబుద్ధులు చెప్పి
పరమయోగంబున బ్రహ్మలోకమున, కరిగె దేహము వాసి యానరేశ్వరుఁడు
యంత నిక్ష్వాకుండు నక్షీణబుద్ధి, కొంతకాలము భూమి కుశలుఁడై యేలి
యిమ్ముగ పుత్రకామేష్టి గావించి, సమ్మదమ్మున దేవసదృశులై వెలయు
కొడుకుల నూర్వుర కొమరొప్ప గాంచె, కడగొట్టుకొడు కందు కడునయోగ్యుండు
నవివేకియును పెద్దలగువారివలన, నవనీతచరితుండునై దండుఁ డనగ
నవనిపై వర్తించు నాదుష్టచరితు, నవగుణంబులు జూచి యానృపాలకుఁడు
తనయుఁ డవధ్యంబు తగ నేలుచుండు, మని తన్నుఁ బంచిన నగుగాక యనుచు
నతఁ డేగి మధువంత మనగ వింధ్యమున, వితతంబుగా నొక్కవీడు నిర్మించి
యెలమి శుక్రుఁడు పురోహితుఁడుగా కడిమి, వెలయు రాజ్యము పెక్కువేలేడు లందు
సలుపుచు నొకయేటిచైత్రమాసమున, నలరుచు భార్గవునాశ్రమంబునకు
చనుదె౦చి యచ్చోట సౌభాగ్యలక్ష్మి, తను వెత్తినట్లున్న దవళాక్షి జూచి
మదనుబాణంబుల మది గాడి తాల్మి, గదల నక్కన్నియ గదియ నేతెంచి
యెవ్వరికూతుర వెద్ది నీనామ, మెవ్వెంట జరియించె దిందు శుక్రోణి
నిను జూచి చిక్కితి నెయ్యంబుతోడ, నను నీవు కరుణించి నాకోర్కె దీర్పు
గైకొంటి నిను నమ్మి కలకంఠవాణి, వా కెత్తి పలుకంగవలవదే యనిన
నౌనని యతనితో ననియె నాపంక, జానన యెంతయు సమ్ముదం బలర
నవనీశ శుక్రుని యగ్రతనూజ, నవమతి దలపకు మరజ నాపేరు
మానుగా నెప్పుడు మాతండ్రి యాజ్ఞ, నే నిట నియతితో నిట్ల వర్తింతు
ధరణీశ నీవు మాతండ్రి శిష్యుఁడవు, గురుపుత్రి నిటు చూడగూడునే నీకు