పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాతిథ్య మొనరింప నంగీకరించి, యాతపోధనునాజ్ఞ నాసీనుఁ డగుచు
సేమంబు లడిగిన జెప్పి యారాత్రి, ప్రేమంబుతో నిల్ప ప్రియమున నిలిచె
నవనీశుఁ గనుగొని యంత కుంభజుఁడు, ప్రవిమలస్నేహార్ద్రభావుఁడై పలికె
నసఘాత్మ నీరాక యతిసంతసంబు, గొనకొని మదిలోన గోరుచుండుదుము
పన్నుగా నెయ్యంబు బాటించి నీవు, మన్నించి వచ్చుట మాతపఃఫలము
పరికింప నిజధర్మపాతకుండైన, పరుషకర్ముని శూద్రుఁ బట్టి దండించి
పుడమిలో బ్రాహ్మణపుత్రుప్రాణములు, వడయజేసితి ధర్మపక్షపాతమున
నింద్రాదిదివిజుల యెద ముల్లు రామ, చంద్రుండ బెరికితి జగమెల్ల నెరుగు
సంతోషమున నీకు సన్మాన మేను, చింతించి యారత్నచిత్రభూషణము
నిచ్చెదఁ గైకొను నిది విశ్వకర్మ, నిచ్చలంబుగఁ జేసె నేర్పెల్ల మెఱసి
వడసిన యర్ధంబు పాత్రంబు లెరిగి, యిడిన యాఫల మెక్కు డెందు నావుడును
తనలోన క్షత్త్రియధర్మ మూహించి, జననాథుఁ డాకుంభజన్ముతో ననియె
దాన మందుట విప్ర్రధర్మంబు గాని, తా న౦దు టది రాజధర్మంబు గాదు
తలఁప మీ రెఱుగని ధర్మతత్వంబు, గలదె నావుఁడు నయ్యగస్త్యుండు పలికె
పృథివిపై విప్రులు పెల్లన జూచి, ప్రథమయుగంబున పృథువు చింతించి
సురల నిద్దురబోవ జూచి భూజనులు, నరయంగ జాలినయట్టి క్షత్రియుఁడు
ధరణికి రాజుగా దగునంచు వచ్చి, పరమేష్ఠి గనుగొని భర్తతో నెఱిఁగి
మము నేలఁదగురాజు మది విచారించి, కమలసంభవ నీవు కల్పింపవలయు
ననయంబు నారాజు నాజ్ఞకు వెరచి, ఘనపాపముల వాయగలవార మేము
నీకృపచే నన్న నిర్జరేంద్రాది, లోకపాలుర జూచి లోకేశుఁ డనియె
తిరముగా మీరు మీతేజంబులందు, పరగ నయ్యాచతుర్భాగంబులందు
సకలాంశముల సముజ్వలుఁడైన రాజు, నొకని నిర్మించెద నుర్విఁ బాలింప
నని వారిచే కొన్నియంశముల్ గూర్చి, వినుతరూపాదుల వెలయ నిర్మించె
క్షుపుడను శూరుఁడు క్షోణీవిభుండు, నృపనీతికళలందు నిష్ఠాత్ముఁ డగుచు
శక్రునంశమున భూచక్రంబు విపుల, విక్రమంబున నేలు విభజిష్ణుఁ డగుచు
వరుణునంశంబున వసుధలోనెల్ల, పరితుష్టి గావించు పరగ ప్రాణులకు
ధనదునంశంబున ధనసంగ్రహంబు, తనరంగ గావించి తగుచోట నిచ్చు
చండకోపమున జమునియంశమున, దండించు నటుగాన ధరణీశ నీవు
పెనుపారుచున్న కుబేరునంశమున, గొనిన దోషము లేదు కొనుమంచుఁ బలికి