పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారాక్షసుం డంత నాపుత్రుఁ జూచి, ఘోరపాపుఁడు వీఁడు కొడు కయ్యె ననుచు
చిత్తంబులో చాల చింతించి యతఁడు, చిత్తజాంతకుచేత చెన్నారఁ గన్న
ఘనశూల మిచ్చి యాకథయు నీచంద, మని చెప్పి వరుణాలయంబున కఱిగె
నది మొదలుగా నాతఁ డాశూలమహిమ, నొడవుదర్పముతోడ నుగ్రుఁ డై మండి
మూడులోక౦బులు మొగి నేలుచున్న, వాఁ డుగ్రకర్ముఁ డై వారింపఁబడక
మానక గారించు మము విశేషించి, వానిబాధలు పెద్ద వసుధలో నధిప
యఱయంగ నాశూలయతులప్రభావ, మఱుదు లోకములోన నతనివిక్రమము
పరగ మాచే వానిబాధలు వినియు, ధరణీశులెవ్వరుఁ దల లెత్తరైరి
మాకు శరణ్యులు మరి మీరె కాన, గైకొని మునిరక్ష గావింపవలయు
పౌలస్త్యకులముఖ్యుఁ బరుషప్రతాపు, త్రైలోక్యకంటకు దశకంఠు నలఁగి
యనిలోన పుత్రమిత్రాదులతోడ, దునుమాడి జగములు దుఃఖంబు లుడిపి
విచ్చేయుటంతయు విని విని బాధ, లచ్చుగా నెఱిఁగింప నని యేము రాక
యనుడు నావాక్యంబు లతిభక్తితోడ, విని పల్కె నారఘువిభుఁడు కేల్మొగిచి

లవణాసురునిచరిత్ర

యరయ నాతని కెద్ది యాహార మెద్ది, చరిత మెందుల నుండు సకలంబు నాకు
వినుపింపవలయు నా విని దేవ వాఁడు, గొనయ డీయశనంబు కొలది మున్ వినుడు
వదలక పదివేలు వనలులాయములు, పదివేలు మృగములు పరిపూర్ణతనులు
నరులు నన్నూర్వురు నన్నూరుగజము, లరుదుమేనుల వరాహములు నన్నూరు
వొకపూటభుక్తిగా నొగి గొనుచుండు, ప్రకటపాపస్థితిఁ బ్రతివాసరంబు
దక్కినజీవులఁ తగ పెక్కువేల, నక్కజంబుగ గొను నవనీతలేశ
యధికరోషాంధుఁడై యధికుల నడచు, మధువనంబున మదోన్మత్తుఁడై యుండు
ననుడు నప్పాపాత్ము నని ద్రుంచివైతు, మునులార వెఱవక ముద మొందుఁ డనుచు
భరతశతృఘ్నులపై దృష్టిఁ బరపి, కరుణార్ద్ర హృదయుఁడై కాకుత్స్థుఁ డనియె
నేపార మీలోన నెవ్వ రాలవణు, నోపి చంపెడువారు యుద్ధరంగమున
నావుఁడు భరతుండు నరనాథ లవణు, నే వధించెద బంపు డింక న న్ననిన
జననాథుఁ గనుగొని శతృఘ్నుఁ డనియె, వినతుఁడై హస్తారవిందముల్ మొగిచి
భూపాల సత్యంబు పూరింప మీరు, తాపసవేషంబు ధరియించి చన్న
విచ్చేయుడని మిమ్మ వేడ రాకున్న, వచ్చి నందిగ్రామవాసియై యచట