పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనకజ గూర్చుండి సౌమిత్రి నాకు, మనసు గలంగెడు మాటిమాటికిని
ఒడలు వడంకెకు నొప్పనిచోటు, లడరంగఁ బలుమాఱు నదరంగఁ దొణఁగె
బుడమి శూన్యాకృతిఁ బొడసూపినట్లు, కడుఁగీడుశకునముల్ గనుచున్నదాన
నీదుర్నిమిత్తంబు లిచ్చదోషములు, మేదినీవిభునకు మీకు నత్తలకు
మేదినీజనులకు మిత్రవర్గముల, కేదియుఁ గాకుండ నిమ్మంచు సురల
వినయంబుతో సీత వినుతించె నంత, వనములు నగములు వడి దాఁటిపోయి
గోమతీతటమునఁ గోరి నాఁ డుండి, యామఱునాడు మధ్యాహ్నకాలమున
భాగీరథీతీరభాగంబుఁ జేరి, యాగంగఁ గని సీత యలకంట చూచి
యెలుఁగెత్తి సౌమిత్రి యేడ్చినఁ గలగి, వెలవెల్లనై కడు వెఱఁగంది పలికె
ముదముఁ బొందక నీవు మూఢునిభంగి, నిది యేల శోకించె దిది పుణ్యభూమి
మీయన్నఁ బాసియో మిగులఁ గోపించి, మీయన్న గినిసినో మిన్నక నిన్ను
నాప్రాణనాథుని నరనాథుఁ బాసి, యీ ప్రాణములతోడ నే నుండఁగలనె
యిమ్ముల నీ వింక నీదుఃఖ ముడుగు, క్రమ్మఱఁబోదము కాకుత్స్థుఁ జూడ
నను గంగ దాటించు నాకు నమ్మునులఁ, గనుఁగొను వేడుక గలదు నావుడును
నరద మక్కడ డిగ్గి యాతేరుతోడ, దరి సుమంతుని నున్చి తాను సీతయును
నావపై నది దాఁటి నవకుశోల్లసిక, పావనతటభూమిఁ బద్మాక్షిఁ జూచి
కన్నీరు దొరఁగ గద్గదకంఠుఁ డగుచు, విన్ననై వదనారవిందంబు వాంచి
యీక్రూరనిశ్చయం బేమని నేను, వాక్రుచ్చిపలుకుదు వైదేహియెదుర
రాజస్య కెఱిఁగింపరాదు పో నాకు, రాజన్యవిభుఁడైన రఘురామునాజ్ఞ
తప్పంగవచ్చునె తలఁప నిత్తెఱఁగు, చెప్పక పోరాదు చెప్పరా దనుచు
విన్ననై కన్నీరు వెడల శోకించు, చున్న లక్ష్మణుఁ జూచి యుల్లంబు గలఁగి
యిది యేల శోకించె దేమాట వింటి, పదిలుఁడై యున్నాఁడె పార్థివేశ్వరుఁడు
నామది గలఁగెడు నరనాథపుత్ర, యే మది చెప్పవే హృదయేశుమాట
యనవుఁడుఁ దెగువతో హస్తముల్ మొగిలి, జనకజనేమంబు జననాయకునకు
మఱియొక్కకొఱగాని మాట నీ కేను, వెఱచెద నెఱిఁగింప విను దానితెఱఁగు
పగవానిచేఁ బట్టువడియున్న మగువ, మగుడంగఁ గొనివచ్చి మన్నించినాఁడు
అని లోకు లాడెడి యపవాదమునకు, మనమునఁ గడునొచ్చి మానవేశ్వరుఁడు
నీశుభాచారంబు నిర్మలం బైన, నీశీలమును మున్ను నిక్కంబు గనియు
నీకానను డించి యేగుదెమ్మనుచు, నాకు నానతి యిచ్చినాఁ డంచుఁ బలుకఁ