పుట:మార్కండేయపురాణము (మారన).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తనసముజ్జ్వలదీప్తివితాన మడరి, యఖిలజనులకు ననురాగ మావహింప
నెలమి ననసూయ మహితార్ఘ్య మెత్తి మ్రొక్క, నుదయగిరిశిఖరంబున నొప్పె నినుఁడు.

189


వ.

పదిరాత్రుల కిట్లు ప్రభాకరుం డుదయించుటయు.

190


క.

మునివరునితీవ్రశాపం, బునఁ బ్రాణవిముక్తుఁ డై విభుఁడు వ్రాలిన మే
దినిఁ బడకుండ నతని న, వ్వనితామణి పొదివి పట్టె వగ మదిఁ గదురన్.

191


వ.

అట్లు మృతుఁ డైన నయ్యత్రికళత్రం బప్పరమపతివ్రతం గనుంగొని.

192


క.

మతి నొక్కింతయు వగవకు, పతిశుశ్రూషాతపంబుబలమున నే నీ
పతి నిదె మగుడం బడసెద, నతిరయమునఁ జూడు శుభగుణాన్వితమూర్తిన్.

193


వ.

అని పలికి.

194


చ.

అనుపమరూపశీలవిజయాదిగుణంబుల నాదుభర్తతో
నెన యొరు నేను గాన నను నీదృఢసత్యము పేర్మి నీద్విజుం
డనయము లబ్ధజీవుఁడు నిరామయుఁడు న్దృఢయౌవనుండు నై
వనితయుఁ దాను గూడి శతవత్సరము ల్పుఖియించుచుండెడున్.

195


తే.

మనముఁ బలుకును జెయ్వు సమత్వ మొందఁ, బతికి శుశ్రూష సతతంబు భక్తిఁజేయు
దాన నే నైతినేని యీధరణిసుతుఁడు, ప్రాణయుతుఁడు గావుతమని పల్కుటయును.

196


ఉ.

ఆవసుధామరుండు విగతామయుఁడు న్నవయౌవనుండు తే
జోవిభవాధికుండు నతిసుందరుఁడు స్సురసన్నిభుండు నై
తా వెస నుత్థితుం డగుడు దైవతసంఘము మెచ్చి సమ్మద
శ్రీవిధిఁ బుష్పవృష్టిఁ గురిసె న్మొరని న్దివి దేవదుందుభుల్.

197


వ.

అప్పుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రభృతిదేవత లనసూయతో నిక్కార్యంబు చక్కం
బెట్టుటం జేసి నీవలన నేము సంతుష్టినొందితిమి వరం బిచ్చెద మడుగు మనవుడు నాకుం
బ్రజాపతిశ్రీపతిపశుపతులు పరమయోగ్యు లైనపుత్రులై పుట్టవలయు ననిన నత్తప
స్వినికి నద్దేవత లావరం బొసంగి నిజస్థానంబుల కరిగి రనసూయయు నిజనివాసంబు
నకుం జనె నంతఁ గొంతకాలంబునకు ఋతుమతియు శుచిస్నాతయు మనోహరా
కృతియు నై యున్న నిజాంగనం గనుంగొని యత్రి యంగజాయత్తుం డై దానిం గల
సిన నతనిశుక్లం బప్పడఁతిగర్భంబునం బడునెడం బవనుండు పార్శ్వంబులకు
నూర్ధ్వంబునకుం గా నారేతంబు మూఁడుపాళ్లు గావించుటయు రెండంశంబు
లప్పుణ్యవతియుదరంబునం బ్రవేశించె నయ్యూర్ధ్వగతం బైనభాగంబునం జేసి
యమునీంద్రునేత్రంబునందు.

198

బ్రహ్మవిష్ణురుద్రాంశముల సోమదత్తాత్రేయదుర్వాసు లవతరించుట

క.

అతులరజస్స్ఫురితుండై, శతధృతిసదృశుఁ డయి పుట్టెఁ జంద్రుఁడు తనుదీ
ధితులు వెలుఁగంగ లలిత, స్థితి నోషధు లెలమిఁ బొంద క్షితిజను లలరన్.

199


వ.

అప్పుడు దిశలు పదియు నయ్యమృతకరునిం జేకొని పెనిచె నంత.

200