పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

మన్నారుదాసవిలాసము


తే.

రెవ్వరో? యాప్తబంధువు లెలమిఁ దనకు
నెమ్మి నాతోడు నిజము చెంగమ్మె యనుచు
మఱియు యోజన సేయుచు మనసులోన
నవ్విలాసిని యట వచ్చునవసరమున.

43


విలాసవతి విజయరాఘవుఁ జేరి కాంతిమతీసౌందర్యాతిశయమును, చాతుర్యమును వర్ణించి యామెను బెండ్లియాడ వేడుట; మన్నారుదాసుఁడు (విజయరాఘవుఁడు) సమ్మతించుట

వ.

అవ్విజయరాఘవనృపతిలకుండును జలకంబులాడి చలువలు ధరియించి,
బంగారుపనుల రంగారు పరంగిపీఁటపైఁ బ్రాఙ్ముఖుఁడై కూర్చుండి, యప్పు
డప్పురోహితు లందిచ్చు శుద్ధోదకంబుల శుద్ధాచమనంబుఁ గావించి, సంత
సంబునఁ గాంతలుం దాను నంతఃపురంబు వెడలి, కుందనంపుసవరణల
నందం బగు నందలం బెక్కి యిరుగడల దొరలును, సామంతమహీకాంతు
లును బలసి కొలువ, వామభాగంబునం గనుపించు క్షేమకారిదర్శనంబు
గావించి మౌనముద్రఁ బూని హృదయారవిందంబునం బొందుగా నరుణార
విందేందిరారాజగోపాలకుల పదాంభోజంబులుఁ దలంపుచు, ఠీవి మెఱయఁ
గోవిలఁ జేరవచ్చి వేత్రహస్తు లందంద సందడిఁ దొలఁగింప నందలంబు
నందంబుగా డిగి, యొక బోఁటి తేటపన్నీటఁ బదారవిందంబులుఁ గడుగ
మఱియు నొకపడఁతి గడితంపుఁబావడం దడి యొత్త, జెలువుమీర
నిలిచి కపిలధేనువులకు గ్రాసంబు సమర్పించి, [1]భృంగారసలిలక్షాళితంబు లగు
తధేనుశృంగతీర్థంబుఁ గరంబునను పవిత్రం బగు తదంగసలిలంబుఁ దద్వా
లాగ్రంబునను, శిరంబునఁ బ్రోక్షించుకొని, యాయయ్యసన్నిధి నున్న
శ్రీవైష్ణవశ్రేణులకు భక్తిమీర మ్రొక్కి, యచ్చట న్మెచ్చువచ్చు నవరత్న
సింహాసనంబునఁ జెంగమలాంబిక చెగటఁ జెలంగ నిరువంకలఁ బొంకంబుగా
రుక్మిణీసత్యభామలు కొలువుసేయఁ గన్నులపండు వగుచుఁ దనసన్నిధి
సేసి పెన్నిధివలె కొలువున్న మన్ననారుల సేవించి, సాష్టాంగదండప్రణా
మంబులుఁ గావించి, యాచెంగట రంగుమీర నొద్దిక గావించిన బంగారు
గద్దియమీఁద శతక్రతు శ్రీనివాసతాతయాచార్యశేఖరు లగ్రభాగంబునఁ
గూర్చుండ బద్మాసనాసీనుండై యమ్మహామహు నుపదేశక్రమంబున
శుద్ధాచమనం బొనర్చి, యందుఁ గొంద ఱాచార్యశిఖామణులు దివ్య
ప్రబంధంబులును, గొందఱు భాగవతాదిబహుపురాణంబులు వినికిసేయుచు

  1. భృంగారు. క. భృంగారు