పుట:భీమేశ్వరపురాణము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దండిబిరుదులసురతాని గుండెదిగుల, భలిరె యల్లయవేముని పగఱమిండ
రమణమించిన మేదిని రావుబిరుద, సంగరాటోపమాదయ లింగభూప.


అనుపద్యమును జదివి దానిని మరలఁ బుచ్చుకొనెను. ఇదియునుఁగాక పైనుదాహరింపఁబడిన “నూనూఁగుమీసాల” యను పద్యమువలన శ్రీనాథుఁడు కాశీఖండమును రచించినపుడు “ప్రౌఢనిర్భరవయఃపరిపాకము” దాఁటియుండెను. ఆ కాశీఖండ మల్లాడ వీరభద్రారెడ్డి వేంకటగిరి సంస్థానమువారిలోఁ దొమ్మిదవపురుషాంతరమునం దున్నలింగమనేని సమకాలికుఁడు. దీనికిఁ బ్రమాణము.


ఉ.

బల్లరగండలింగవిభుపాదమునందుఁ బసిండియందె తా
ఘల్లురుఘల్లుఘల్లురని ఘల్లని మ్రోయఁగ భీతి గుండియల్
ఝల్లురుఝల్లుఝల్లురని ఝల్లన నల్లలాడుచుందు రా
యల్లయరెడ్డివేముఁడును నాతనితమ్ముఁడు వీరభద్రుఁడున్.


ఈకవి సింగమనాయనియొద్దకు రాఁ గతము మృగ్యము.

పైనుడువఁబడిన “సర్వజ్ఞ నామధేయము” అను పద్యమును సింగమనాయని కొలువులో శ్రీనాథుఁడు చదివి మరలినవెనుక రెడ్లవారతని నిచ్చకాలమారియని యాక్షేపించినట్లును దానికతఁ డాపద్యమున కన్యార్ధము కల్పించినట్లును నొక ప్రతీతి బ్రహ్మశ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులవారి కవి జీవితములందుఁ గనఁ బడుచున్నది. "దీనారటంకాల” యను పద్యముం జదివినవారును "సింగభూపాలీయ" మనునామాంతరముగల ‘రసార్ణవసుధాకరా’ద్యుద్గ్రంథకర్తయు రసజ్ఞుఁడునునగు సింగభూపాలునిమహిమ నెఱింగినవారు నీకథ నంతయు నమ్మరు. ‘సర్వజ్ఞ నామధేయము’ అని శ్రీనాథుఁడు పొగడినదే నిజమును సలక్షణమును.

ఇంక శ్రీనాథునిఁ బోతనామాత్యుఁ గూర్చి కొన్ని కథలు కలవు. అవి యన్నియుఁ బోతనామాత్యుని పారలౌకిక ధర్మంబును శ్రీనాథుని యైహికభోగేచ్ఛను దెల్పునవి.

ఇంతటి మహాకవి యయ్యును గొప్పవారియాశ్రయముగలిగియుండియు ననేక గ్రంథముల రచించి యనేకుల కంకిత మిచ్చి లాభముఁ బొందియుండియు శ్రీనాథుఁడు తనయందలి గొప్పలోప మగు స్త్రీలౌల్యము వలనఁ గాఁబోలు నవసానదశయందు మిగుల దారిద్ర్యము ననుభవించినట్టు లీక్రింది పద్యములు తెల్పుచున్నయవి.


సీ.

కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా, పురవీథి నెదురెండఁ బొగడదండ
సార్వభౌమునిభుజాస్తంభమెక్కెనుగదా, నగరివాకిటినుండు నల్లగుండు