పుట:భాస్కరరామాయణము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామచంద్రుండు శివునివిల్లు విఱుచుట

ఉ.

పంచినవేడ్క లుల్లమునఁ బైకొన వారును నేఁగి యష్టచ
క్రంబు నయోమయంబును ధరాధరమూర్తియుఁ గాలమేఘతు
ల్యంబును నైనమందస బలంబున నందఱు ద్రొబ్బి తెచ్చి చో
ద్యంబునతోడఁ గన్గొనఁగ నాసభ ముందటఁ బెట్టి నిల్చినన్.

675


వ.

జనకుండు కౌశికుం గనుంగొని.

676


క.

సురగరుడోరగయక్షా, సురకిన్నరదనుజరాక్షసుల కైనను దు
ర్బర మగునీధను వెత్తఁగ, నరు లెంతటివారు గాధినందన యయినన్.

677


ఉ.

ఏపునఁ జూపు మీధనువు నీనృపపుత్రుల కంచుఁ బల్క నా
తాపసపుంగవుండు వసుధావరశేఖరు రాముఁ జూచి యీ
చాపము లీల నెత్తి భుజసత్త్వ మెలర్పఁగ నెక్కుపెట్టు నా
నాపటువిక్రమక్రమసమగ్రుఁడు రాముఁడు చేరి వేడుకన్.

678


క.

మందసఁ దెఱచి జనుల్ వెఱఁ, గందఁగ విలు వెడలఁ దిగిచి యాగవుసెన లీ
లం దొలఁగఁ ద్రోచి భూస్థలి, నందముగా నిల్పి మౌర్వి నలవఱిచి వెసన్.

679


మ.

కలభం బాతతచండతుండమున వీఁకన్ శేషనాగేంద్రునిన్
బలిమిం బట్టినభంగి రామధరణీపాలుండు కోదండమున్
బలుముష్టిన్ వడిఁ బట్టి యెత్తి తెగ విస్ఫారంబుగాఁ జేసి ని
శ్చలుఁ డై యల్లన లస్తకంబు వదలెం జాపంబు భగ్నంబుగన్.

680


క.

నారులఁ బట్టినవారికి, నారయ ధర్మములు గలవె యన నారిఁ గరం
బారంగఁ బట్టి రాముఁడు, పౌరులు చూడంగ ధనువు భగ్నము సేసెన్.

681


మ.

ధను వుద్యద్గతి రాముఁ డట్లు విఱువం దద్ఘోరఘోషం బొగిన్
ఘననిర్ఘాతనిపాతజాతనినదోగ్రధ్వాన మై మ్రోసిసన్
విని యాస్థానమువార లెల్ల వడిఁ బృథ్విం చెల్లి మూర్ఛిల్లి రా
జనకాధీశుఁడు రామలక్ష్మణులు విశ్వామిత్రుఁడుం దక్కఁగన్.

682


చ.

కులగిరు లెల్లఁ బెల్లగిలెఁ గుంభిని యల్లల నాడె దిగ్గజం
బులు బెదరెన్ భుజంగపతి బొమ్మరబోయెఁ బయోధు లన్నియుం
గలఁగె దిగంతముల్ వగిలెఁ గన్కనిఁ దారలు రాలె సూర్యచం
ద్రులగతి తప్పె మేఘములు దూలె నజాండము మ్రోసె నయ్యెడన్.

683


మ.

జనకుం డచ్చెరు వంది యెంతయు మదిన్ సంతోష ముప్పొంగ న
మ్మునిచూడామణితోడ ని ట్లనియె రాముం జూపి యీరాజనం
దనుశౌర్యం బతివిస్మయం బసమ మత్యంతంబు నాకూఁతు నీ
తని కే నిచ్చెదఁ బ్రీతి నాపలుకు నిత్యం బై నుతిం బొందఁగన్.

684


వ.

అని పలికి మునియనుమతిం దగినమంత్రులం బిలిపించి మీరు దశరథుకడ కేఁగి