పుట:భాస్కరరామాయణము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పుడు.

453


క.

సురమునిగంధర్వులు గడుఁ, బరమాశ్చర్యమున జహ్నుఁ బ్రార్థనతో నీ
సురనది వెడలింపుము త, త్పరబుద్ధిని నీకు దుహితృభావముఁ బొందన్.

454


క.

అన విని జహ్నుఁడు సమ్మద, మునఁ దనఘనకర్ణరంధ్రమున వెడలింపన్
జనె నది మొదలుగ జాహ్నవి, యనునభిధానంబు జగతి నభినుతిఁ బొందెన్.

455


ఉ.

ఆగతి జహ్నుకర్ణకుహరాగ్రవినిస్స్రుత యైనగంగ వే
వేగ భగీరథుండు దనవెంటనె వెండియు నేఁగుదేరఁగా
సాగరవీథిఁ జొచ్చి బలిసద్మము చేరఁగఁ బోయి ముందటన్
సాగిన భస్మరాశిమయసాగరులం బొడగాంచి దీనతన్.

456


వ.

అత్యంతదుఃఖాక్రాంతుఁ డై ప్రపితామహభస్మరాసులు గంగపావనజలంబుల
సంసిక్తంబులు సేయునెడ సర్వలోకపితామహుం డగుపితామహుండు వచ్చి
భగీరథుం జూచి యి ట్లనియె.

457


చ.

సగరతనూజు లందఱును స్వర్గముఁ బొంది రమర్త్యమూర్తు లై
యగణితపుణ్య నీకతన నన్వయ మెల్లఁ బవిత్ర మయ్యె నా
సగరతనూజు లందఱును సాగరతోయము లుర్విలోపలన్
నెగడెడునంతదాఁక దివి నెమ్మది నుండెద రిచ్చ లారఁగన్.

458


ఉ.

గారవ మార నీదివిజగంగ భవత్సుత యై తగంగ భా
గీరథి నాఁగ నొప్పెడు భగీరథభూపతి లోకపావనో
దారసుకీర్తి నొంది త్రిపథంబుల నిట్లు గమించెఁ గాన పెం
పార ధరిత్రిలోఁ ద్రిపథగాహ్వయ యై విలసిల్లెడుం గడున్.

459


క.

సగరాంశుమద్దిలీపులు, దగ ధర్మప్రవణబుద్ధిఁ దమవంశజులన్
సుగతులుగఁ జేయుకొఱకును, గగనాపగఁ దేర లేక కడచిరి వత్సా.

460


మ.

అతిపుణ్యుండవు వంశపావనుఁడ వుద్యద్గోత్రమిత్రుండ వు
న్నతబుద్ధిం బ్రపితామహప్రతతులన్ నాకంబు నొందంగఁ దె
చ్చితి నాకాపగ నింక నీప్రతిన వచ్చెన్ వ్యక్తపూతాంబుస
త్కృతు లోలిన్ విరచించి నీపురికిఁ బ్రీతిం బొమ్ము భూనాయకా.

461


వ.

అని పలికి బ్రహ్మ దనలోకంబున కరిగె నంత భగీరథుండును దనప్రపితామహు
లకు నాగంగలో విహితక్రమంబున ధర్మోదకతంత్రం బాచరించి శుచీభూతుం
డై తనపురంబున కరిగి సకలజనులు దన్ను సేవింప సర్వార్థసమృద్ధుం డగుచుఁ
బరమానందంబున రాజ్యంబు సేయుచుండె గంగావతరణంబు నీకు విస్తరించి విని
పించితి సంధ్యాకాలంబు వర్తిల్లుచున్నది రామచంద్రా నీకు భద్రస్వస్తులు గాని
మ్ము గంగావతరణోపాఖ్యానంబు బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులందు నెవ్వండు
చదువు నెవ్వండు వ్రాయు నతనిపితృదేవతలు ప్రీతాత్ము లగుదు రతం డఖిలపా