పుట:భాస్కరరామాయణము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షితిచక్రంబు నవక్రవిక్రమబలోత్సేకంబు లేపారఁగన్.

406


వ.

మఱియు.

407


శా.

అధ్వప్రేక్షితరాక్షసాసురభుజంగాత్యుగ్రసత్వావళీ
విధ్వంసంబులు వీఁకఁ జేయుచు మహోర్వీచక్రవిస్ఫారఘో
రధ్వానంబులు దిక్కులం జెలఁగ దుర్వారాసిముఖ్యాభ లి
ద్ధధ్వాంతాద్రులలోనఁ బె ల్లెసఁగ నాధాత్రీశపుత్రుల్ వెసన్.

408


చ.

[1]గుఱుకొని నేల వ్రక్కలుగఁ గ్రొచ్చియు మన్నులు మ్రింగియున్ శిలల్
వెఱికియు నోలి నొక్కొకఁడు వేగమ యొక్కొకయోజనంబుగా
నఱువదివేవురుం బుడమి నాఫణిలోకముదాఁకఁ ద్రవ్వఁగా
నఱువదివేలుయోజనము లక్కజ మారఁగ నయ్యె నయ్యెడన్.

409


వ.

అప్పుడు సురాసురగంధర్వపన్న గాదులు భీతు లగుచు సంభ్రమంబునఁ బితా
మహుపాలికిం జని యమ్మహానుభావుం బ్రసన్నునిం జేసి విషణ్ణవదనంబులతో
నిట్లనిరి దేవా సగరపుత్రులు సకలభూమియు వ్రక్కలించుచు సర్వభూతహింసలు
సేయుచు నున్నవా రశ్వంబుకొఱకు నని పలుకం గమలాసనుండు వారివచనంబు
లాలించి యి ట్లనియె.

410


క.

క్షితి కరయ వాసుదేవుఁడు, పతి గావున నవ్విభుండు పరఁగఁగ లీలా
కృతిఁ గైకొని యీసకల, క్షితియును ధరియించియుండుఁ జెన్నుగ నెపుడున్.

411


క.

భూభేదనకారణమున, నాభూపతిపుత్రు లెల్ల నాకపిలునికో
పాభీలవహ్నికీలల, చే భస్మము గాఁ గలారు శీఘ్రమ యనినన్.

412


క.

అలరి త్రయస్త్రింశత్త్రిద, శులు దమతమధామములకు సొంపార ముదం
బుల నేఁగి రచట నాభూ, తలపతినందనులు నధికదర్పము లొప్పన్.

413


మ.

నిరతిన్ భూమి నగల్చుచోటను మహానిర్ఘాతసం కాశని
ష్ఠురభూరిధ్వని మ్రోయ మించి మఱియున్ క్షోణీతలం బెల్ల ని
ర్భరతం ద్రవ్వి ప్రదక్షిణం బడరఁ బైపైఁ బేర్చి యచ్చోట నా
తురగంబుం బొడగాన కేగి నృపపుత్రుల్ దండ్రితోడం దగన్.

414


మ.

సగరక్ష్మావర దేవదానవపిశాచస్తోమదైతేయప
న్నగరక్షోగణకిన్నరప్రభృతినకనాజీవులం ద్రుంచుచున్
జగతీచక్రముచుట్టుఁ ద్రవ్వితిమి విశ్వంబున్ మఖాశ్వంబుచొ
ప్పు గనం జోరునిఁ గాన నేర మెచటన్ భూమీశ యింకం దగన్.

415


క.

పని యేమి గలదు వలసిన, పనిఁ బంపుము మమ్ము ననుచుఁ బలుకఁగ వారిం

  1. క. ఆఱువదివేవురు నోలి, న్వఱలఁగ నొక్కొక్కయోజనము భూవలయం
        బఱిముఱిఁ ద్రవ్వఁగఁ జుట్టును, నఱువదివేల్ యోజనంబు లై విలసిల్లెన్.
        ఇది ప్రక్షిప్త మని తోఁచెడి.