పుట:భాస్కరరామాయణము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రొవ్వునఁ జేయ రక్కసులు గ్రుమ్మరుచుండుదు రద్దురాత్ములన్
నివ్వటిలంగ నీక శితకనిష్ఠురబాణములన్ వధించెదన్
నెవ్వగ లెల్లఁ బాసి నను నిర్జరు లెంతయు సంస్తుతింపఁగన్.

266


వ.

అని పలికినం గౌశికుండు రామచంద్రుం గనుంగొని యిది వామనునిపూర్వాశ్ర
మంబు వినుము.

267


క.

ఈయాశ్రమమున విష్ణుఁడు, పాయక యుగశతము లైన బహువర్షము ల
త్యాయతతప మొనరించి త, పోయుక్తిం గామ్యసిద్ధిఁ బొందుచు నుండున్.

268


చ.

బలి యనుదైత్యనాయకుఁడు బాహుబలోద్ధతి సర్వదేవతా
బలముల నింద్రునిన్ గెలిచి ప్రాభవ మొప్పఁగఁ బట్టబద్ధుఁ డై
యలరి తదీయరాజ్యము సమస్తముఁ జేయుచుఁ బేర్మితోడ ది
క్కులఁ దనకీర్తి పెంపెసఁగఁ గోరిక యజ్ఞము సేయుచున్నెడన్.

269


క.

దనుజారిఁ గానఁ బోవుడు, మనయాపద లుడిపి ప్రోచు మసలక మధుసూ
దనుఁ డంచు నలువ మొదలుగ, ననిమిషు లీయాశ్రమమున కరుదెంచి తగన్.

270


చ.

కడుముద మార విష్ణుఁ బొడగాంచి జనార్దన భూరివైభవం
బడర విరోచనాత్మజుఁడు యజ్ఞము సేయుచు నెవ్వ రేమి త
న్నడిగిన వారి కెల్ల నఖిలాభిమతంబుల నిచ్చుచున్నవాఁ
డడఁకువ లేక యాఘనుని యజ్ఞసమాప్తికి మున్న వంచనన్.

271


క.

వామనరూపము గైకొని, మామే లొడఁగూర్చి దేవ మముఁ బ్రోవు కృపా
ధామ యని సురలు వేఁడఁగ, నామెయిఁ గశ్యపుఁడు దాను నదితియుఁ గోర్కిన్.

272


క.

చనుదెంచి యీశుభాశ్రమ, వనమున వ్రతనిష్ఠ దివ్యవర్షసహస్రం
బనుపమతర మైనతపం, బొనరించి తపంబు పూర్తి నొందఁగ భక్తిన్.

273


మ.

కలితశ్రీశుభవక్ష దేవవర నీరగాత్రంబునన్ ముజ్జగం
బులు [1]పెంపొందుచు నుండు శోభనమహామూర్తిం గనుంగొంటి నిం
పలరన్ నీశరణంబు గంటి వరదా యంచుం బ్రశంసించి ని
శ్చలమోదంబునఁ దాను బత్నియును జంచద్భక్తితో మ్రొక్కినన్.

274


క.

కరివరదుఁడు ప్రీతుం డై, కరుణం గశ్యపునిఁ జూచికకశ్యప నను నే
వర మడిగె దడుగు నీ కా, వర మిచ్చెద ననిన మ్రొక్కి వాంఛిత మారన్.

275


క.

అదితికి నాకు సుతుఁడ వై, యుదయించి నిలింపపతికి నున్నతవిభవం
బొదవఁగ ననుజన్ముఁడ వై, ముదమున నేలింపు లోకములు మీయన్నన్.

276


క.

సిద్ధాశ్రమ మిది యభిమత, సిద్ధుఁడ వై తెన్నఁడేని శ్రీవర నిన్నున్
బుద్ధిఁ దలంచినవారికి, సిద్ధముగా సర్వకార్యసిద్ధులు గలుగున్.

277
  1. పెంపొందెడు నీతపోమయుఁ దపోమూర్తిం దపోరాశిని
    శ్చలభక్తిం దప మాచరించి నిఖిలస్వామిం గనుంగొంటి నిం
    పలరన్ నీశరణంబు గంటి వరదా యంచుం బ్రశంసించినన్.