Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మిక్కిలి కోపించి యక్కజంబుగ దశ, కంఠుఁడు రాముపైఁ గడఁగి యార్చి
నిశితనారాచముల్ నిగిడించి మర్మముల్, నొప్పింప రాముండు దెప్పరముగ
మంచుముంచినమాడ్కి నించుక యెడలేక, భూనభోవివరంబు మునుఁగ నేసె
నెఱఁకులు దూలంగ నిష్ఠురాస్త్రంబులు, మేదురంబులు గాఁగ మేన గ్రుచ్చెఁ
బరఁగ నిరువురు నన్యోన్యబాణహతులఁ, బుష్పితాశోకకింశుకస్ఫురణ గల్గి
శాల్మలీతరుసముదగ్రశలలమృగము, లనఁగ నొప్పిరి జయకాంక్ష లినుమడింప.

1541


వ.

అయ్యవసరంబున గిరిగుహకుహరంబు వెడలి వచ్చుమృగేంద్రంబు ననుకరించు
చు నంభోధరమండలంబు పాసి చనుదెంచుదంభోళిం బోలి సాగరంబు వెడలి
యేతెంచుబడబానలంబుమాడ్కిఁ బాతాళవివరంబువలన నరుగుదెంచుమహా
నాగంబుపగిదిఁ బ్లవంగబలమధ్యంబువలన నేఁగుదెంచి విక్రమోద్ధతతేజోదృష్టి
భీషణుండై లక్ష్మణుం డెడచొచ్చి యొక్కభల్లంబునం గనత్కనకమణికుండలమం
డితం బగుతత్సారథిమస్తకంబు దునిమి మేరుసారం బగుతదీయకార్ముకంబు నొ
క్కసాయకంబునఁ ద్రుంచి యభ్రంకషం బగుకేతనం బొక్కయర్ధచంద్రసాయ
కంబునం గూల్చి యతివిశాలకదనం బగువశకంఠువక్షంబు పంచవిశిఖంబుల
నొప్పించె నంత విభీషణుండును నీలజీమూతనీకాశంబులును బర్వతప్రమాణగా
త్రంబులును నగురథతురంగంబుల నొక్కటఁ జదియ గద వ్రేసిన విరథుండై లం
కేశ్వరుండు మహీధరోపరి భాగంబున నుండి లంఘించుశరభంబు చాడ్పున నిల
కుఱికి నిలిచి.

1542


మ.

స్ఫుటరోషంబున నవ్విభీషణునిపై భూవిభ్రమాడంబరో
త్కటుఁ డై పంక్తిముఖుండు శక్తిఁ బఱపన్ దంభోళిసంరంభసం
ఘటనాకారత నేఁగుదేరఁ గని యుగ్రస్ఫూర్తి సౌమిత్రి దాఁ
బటుబాణత్రయ మేసి త్రుంచెఁ నది భూభాగంబునన్ వ్రాలఁగన్.

1543


సీ.

జంభారిచే నున్నదంభోళికైవడి, మెఱుఁగుఁదీగలు మిఱుమిట్లు గొలుప
నీలకంఠునిచేతిశూలంబుచాడ్పున, మంటలు దోడ్తోన మింటఁ బొదలఁ
గాలాంతకునిచేతికాలదండముఁబోలెఁ, జూపఱకును దేఱిచూడరాక
జలజలోచనుచేతిచక్రంబువడువునఁ, గడునమోఘం బయి కడలుకొనుచు
మయవినిర్మిత మై మహామహిమఁ దనరిఁ, భూరిమాంసాస్త్రముల నోలిఁ బూజ నొంది
పూని విజయైకసాధన మైనశక్తి, వడి విభీషణుపై వైవ నడరె నతఁడు.

1544


చ.

అనయము నెల్లనాఁడు శరణాగతరక్షకుఁ డైనవానికిం
దను నభయంబు వేఁడినఁ బదంపడి కాచుట ధర్మువే కదా
యని రఘునందనావరజుఁ డారజనీచరనాథుతమ్మునిన్
వెనుకకుఁ ద్రోచి నిల్చి పటువీర్యమునన్ విశిఖంబు లేసినన్.

1545


శా.

విల్లుం గోలలుఁ దాల్చి నీవు భువిలో వీరుండపోలెన్ సమీ