పుట:భాస్కరరామాయణము.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నఱకినకదళీకాండము, తెఱఁగున నటు వ్రాలి తడసి తెప్పిఱి మిను పై
విఱిగి పడినట్లు కడుని, వ్వెఱపడి మఱియు నటు సూచి విహ్వల యగుచున్.

386


తే.

నిష్ఠతోఁ బ్రణమిల్లి వసిష్ఠుచరణ, యుగళసంగతి గన్నయకయ్యుత్తమాంగ
మినకులోత్తమ నేఁ డిట్టు లిద్దురాత్ము, మ్రోల నేల నుండెడి దఁట ధూళి బ్రుంగి.

387


వ.

అనుచు నాతల నిజాంకతలంబునకుం దిగుచుకొని.

388


ఉ.

ఏచినయాఖరాదుల ననేకుల నెక్కటి చంపి సంయమీం
ద్రోచితవాక్యపూజనల నొంది జగంబు నలంకరించునీ
యాచిఱునవ్వుతోడివదనాంబుజమా యిది సప్తతంతుర
క్షాచణ తాటకాహరణ శంసితశైశవ హా నరేశ్వరా.

389


చ.

అకట నరేంద్రచంద్ర హరిణాధమముం గనుఁగొన్నయట్టిచూ
డ్కికి నిది పెద్ద గాదు నృపకేసరి ని న్నిటు చూడ నేమి నో
మొకొ తొలుమేన నోచితి రఘూత్తమ నాకొఱకై కదే కపి
ప్రకరము గూర్చి తే నిటు లభాగ్యఁ గదే తుది ముట్టదే కదే.

390


సీ.

ప్రాణేశ పతికిము న్పరలోక మరిగెడు, చెలువ లేతపములు చేసి రొక్కొ
వల్లభ చూచితే వైధవ్య మొక్కింత, వడి యైనఁ గైకొన వలసె నాకు
నాథ నాతో నల్గినాఁడవే నను డించి, యొంటి నీ కి ట్లేఁగ నుచిత మగునె
జననాథ సహధర్మచారిణిగా నన్ను, మాతండ్రి యిచ్చుట మఱవఁ నగునె
నీడఁ గన్ను మొఱఁగి నృపవర బొందికిఁ, బోక గల్గు టెట్లుఁ బొసఁగ దెందు
నేను నిన్నుఁ గూడ నిదె వేగ వచ్చెద, నిమిషమాత్ర మధిప నిలుతుగాక.

391


చ.

జడధి మునింగి లక్ష్మణుఁడు సావక పోయెనయేని నన్నుఁ గో
ల్పడినతెఱంగు నీమరణరభంగియుఁ జెప్ప నయోధ్య నప్పు డే
వడువున శోకసంభ్రమరవంబులు పుట్టునొ నిన్నుఁ గన్నయా
కడుపునఁ బుట్టుచిచ్చునకుఁ గైకమనంబున సంతసిల్లఁగన్.

392


మ.

ఇటు నాకంబున మామజయ్య మనచే నీవార్త విన్నప్పు డ
క్కట మూర్ఛంబడి తేఱిలోఁ బొగులుచుం గైకేయిదుర్భావ మిం
తటికిం దెచ్చెనె మత్కులంబు దురవస్థం బొందెనే యంచు ను
త్కటశోకంబునఁ దూలు నగ్రమహిషీదైన్యంబు చింతించుచున్.

393


క.

అని పలికి పనవు న ట్లా, ధనువును బాణములుఁ జూచి తల యూఁచు నగుం
దనివి వనితె దైవమ యను, నన నేమియు నింక నేటి కను నని మఱియున్.

394


ఉ.

రావణ నీకుఁ బుణ్య మగు రాముపయిన్ నను వైచి ఖడ్గధా
రావిధిఁ బుచ్చవే యనఁగ రక్కసుఁ డొక్కఁడు పాఱు తెంచి దే
వా వెస నేమొ వాకిటికి వచ్చినవాఁడు ప్రహస్తుఁ డన్న నొం
డై వడి నిప్పు ద్రొక్కినటు లద్దశకంఠుఁడు సంభ్రమంబునన్.

395