Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుడివడి మ్రంద నమ్మడువు శోషిలఁజేయుచు నేలఁ గాఁడి య
క్కడ నహిలోకముం గడచి క్రమ్మఱఁ దూణికి వచ్చెఁ జెచ్చెరన్.

230


క.

అంతటను దత్ప్రదేశం, బంతయు మరుదేశ మయ్యె నచటికి నబ్భూ
కాంతుఁడు సరసఫలాం చిత, [1]కాంతార మ్మఖిలహితముగా వర మిచ్చెన్.

231


క.

జల మయ్యిషురంధ్రంబున, నిలకు రసాతలమువలన నెగయుట నాదు
స్స్థలి నది యిషు వనుపేరన్, [2]ఖలకూపం బయ్యె నధ్వగహితం బగుచున్.

232


వ.

తదనంతరంబ సంతుష్టహృదయుం డగుచు నయ్యాపగావల్లభుండు భూవిభుం
గనుంగొని రఘువర మీతండ్రి దశరథుండు దేవాసురయుద్ధంబున నింద్రునకుం
దోడు వచ్చి సుర లసురులకుం గాక యోహటించినప్పుడు తరుగిరివర్షంబు గురి
యుచుఁ గడంగునాకుం దోడ్పడి కోదండపాండిత్యంబు మెఱయుచు గుదులు
గ్రుచ్చిన ట్లుండఁ బలువుర నొక్కొక్కకోలం గూల నేయుచు నాగ్నేయాస్త్రం బేసి
పేర్చుబలంబుల నేర్చి హతశేషు లైనబృందారకారాతులం దోలి విజయంబు
గైకొని యున్నసమయంబున నాశతమఖప్రముఖు లైనదివిజులు పుత్రకాముం
డైనయన్నరేంద్రునకు రామభరతలక్ష్మణశత్రుఘ్ను లనునామంబుల వెలయుచు
మహాతేజు లగుతనూజులు నలువురు గలుగుదు రని వరం బొసంగి దివ్యరథంబు
నమృతసంభవం బైనచూడామణియు ననేకరత్నసహస్రంబులు నిచ్చి వీడుకొల్పు
టయు నమరసఖుండ నైననావలనం జెలిమి నాటించి న న్నయోధ్యకుం దోడ్కొని
చని యన్నగరంబున నొక్కమాసంబు నిల్పి వివిధప్రకారంబుల సంభావించె నమ్మ
హాత్మునియందు నాకుం జేయవలయు నెయ్యంబు నీయందుఁ జరితార్థం బైన నేఁ
గృతార్థుండ నగుదు విశ్వకర్మపుత్రుం డగునలునిచేత సేతుబంధనం బొనరింపం
జేయు మని యుపాయం బెఱింగించె నయ్యవసరంబున.

233


ఆ.

నలుఁడు కేలు మొగిచి నరనాథ మాతండ్రి, విశ్వకర్మ మత్సవిత్రి కొసఁగి
నాఁడు కరుణఁ గర్మనైపుణ్యమునఁ దన, యట్టికొడుకు గలుగునట్టివరము.

234


ఉ.

కావున నిమ్మహాంబునిధిఁ గట్టెద దేవరయాజ్ఞ వానరేం
ద్రావళి తోడుగా ననుడు నవ్వసుధేశుఁడు సంతసిల్లి సు
గ్రీవునిఁ జూచి సేతు వొనరింపఁగఁ బంపు నలుండు మున్నుగా
నీవు వలీముఖోత్తముల నెల్ల సరిత్పతివాక్యపద్ధతిన్.

235


చ.

అనవుడు నాప్లవంగవిభుఁ డప్డు దరీముఖమైందజాంబవ
త్పనససుషేణనీలనలతారగజార్కగవాక్షగంధమా
దనగవయాంజనేయకుముదద్వివిదాంగదముఖ్యవీరులం
గనుఁగొని యిమ్మహార్ణవము గట్టుద మంచుఁ జనంగ నిమ్ములన్.

236


ఉ.

మేటివలీముఖుల్ గడఁగి మేదిని యల్లలనాడ నుద్భటా

  1. కాంతార మ్ముపహితమ్ముగా
  2. గలకూపం బయ్యె నధ్వగర్హిత మగుచున్