పుట:భాస్కరరామాయణము.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్వనిచే జటాయు వీల్గెను, ఘనుఁ డాదశరథసఖుండు గడచెనె యకటా.

699


క.

అని పల్కి రామురాకయు, జనకజపోకయును ననుజుసమరము మరణం
బును సర్వము నేర్పడఁగా, వినవలయు నాకు నింక విదితము గాఁగన్.

700


క.

వృక్షచరులార నాకుం, బక్షంబులు లేవు గాన పదముల నడతే
నక్షముఁడను భవదీయస, మక్షమునకుఁ గొంచుఁ బొండు మన్నన నన్నున్.

701


వ.

అని యిట్లు పలుకుసంపాతిపలుకులు విని యఖిలకపులుఁ జింతించి యీపక్షి
మనల భక్షించునో యెట్లునుఁ బ్రాయోపవేశంబు గైకొని మరణేచ్ఛ నున్నా
రము మనల మ్రింగిన మ్రింగనిమ్ము మృతులమై నాకంబున నుండుద మనునిశ్చ
యంబుతో నరిగి సంపాతిం బట్టి తెచ్చి తమసన్నిధి నిడుకొని రప్పుడు సంపాతిం
జూచి యంగదుండు.

702


ఉ.

రామువనప్రవాసమును రావణుఁ డాగతి వచ్చి వంచనన్
భూమితనూజ నెత్తికొని పోకయుఁ దా మినజుండు పంచినన్
రామునివల్లభన్ వెదక రాకయు జానకిఁ గానలేక తా
రామెయి నున్నచందము సమస్తము నేర్పడఁ జెప్పి వెండియున్.

703


ఉ.

రామునిదేవి నెత్తుకొని రావణుఁ డేఁగఁగ వీఁకఁ దాఁకి ని
స్సీమబలంబునన్ విరథుఁ జేసి మదం బడఁగించి యెంతయుం
బ్రేమముతోడ సీత విడిపించి జటాయువు వానిచేత సం
గ్రామములోనఁ జచ్చి పరఁగంగ దివంబున కేఁగె ధన్యుఁ డై.

704


వ.

తదనంతరంబ రాముండు చనుదించి రావణునిచేత నసిధారాధళితపక్షుండై పడి
యున్నజటాయువుం జూచి శోకించి దశరథునింబోలె సంస్కరించి ధర్మతంత్రం
బాచరించి నాకంబునకుం బుచ్చె నని పలుక విని సంపాతి దుఃఖించి యంగదా
దులతోడ ని ట్లనియె.

705


మ.

ఇనచండాంశులఁ బక్షముల్ గమలి యే నెచ్చోటికిం బోవ లే
కునికిన్ వార్ధక మొందుటన్ ఘనబలం బొప్పారఁగా లేమి నా
యనుజుం జంపినరక్కసున్ వినియు నుద్యచ్ఛక్తి నారావణుం
దునుమం జొప్పడకున్నవాఁడ మదిలో దుఃఖంబునం దూలుచున్.

706


చ.

అన విని యంగదుం డనియె నాఖగనాయకుతోడ వేగ నీ
యనుజునిఁ జంపి చన్నదివిజారి వధించెద నంచుఁ బల్కి తీ
వనఘ వయోధికుండవు సమస్త మెఱుంగఁగ నేర్తు మాకు నిం
పెనయఁగఁ జెప్పు పంక్తిముఖుఁ డెక్కడఁ బెట్టినవాఁడు జానకిన్.

707


వ.

అని పలికిన సంపాతి వారి కి ట్లనియె.

708


క.

దూరపథ మేఁగి నా కా, హారముఁ దెచ్చుకొనఁజాల నటు గావున నా
కూరిమిపుత్రుఁడు నా కా, హారముఁ గొని తెచ్చి పెట్టు నాఁకలి వాయన్.

709