పుట:భాస్కరరామాయణము.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీతను దెచ్చుటకు రావణుఁడు ప్రయాణమై పోవుట

వ.

శూర్పణఖపలుకులకు సంతోషించి మంత్రులం జూచి ఖరదూషణాదుల వధిం
చినయారఘువరువి క్రమవిశేషంబులు వితర్కించి వంచనోపాయంబున సీతం
గొనివచ్చుట కార్యంబుగా నిశ్చయించి కొలువు విడిచి రథంబు సారథిం దెమ్మ
నుచుఁ బ్రచ్ఛన్నమార్గంబునం బురంబు వెలువడి రత్నకాంచనమయంబును బిశా
చముఖాశ్వకలితంబును గామగమనంబును వివిధాయుధభరితంబు నగునిజస్యంద
నంబు పిఱుంద వచ్చుటయు నెక్కి రయంబున నయ్యరదంబు గగనగమనంబున
మెఱయ నానావృక్షలతాదులం బొల్చు వేలావనంబు నెడనెడ ననేకద్వీపంబులుం
గనుంగొనుచు నబ్ధిమధ్యంబునం జని చని బహువిహగకులసంకులంబును విటపి
విటపాక్రాంతరోదోంతరాళంబు నగునొక్కపురాణవటోత్తమంబు సూతునికిం
జూపి తొల్లి వైనతేయుం డమృతంబునకుం బోవుచుండి గజకచ్ఛపంబుల భక్షింప
శతయోజనవిశాలం బగు దీనిశాఖ నిడిన నది విఱుగ నం దున్న వాలఖిల్యాదిమ
హామును లాక్రోశించిన విని యక్కొమ్మ నగ్గజకచ్ఛపంబులు రెంటినిం జరణమండం
బులం బట్టికొని జవంబునం బఱచి తండ్రి కెఱింగించిన నక్కశ్యపుండును వారిం
బ్రార్థించి తదవతరణంబు సేయించినం బదంపడి జనకనిర్దిష్టం బగునిషాదమండ
లంబున నాశాఖ వైచి హిమాచలతటంబున నక్కరటికమఠంబుల నాహారంబు
గొనియె నిమ్మహీరుహంబు పేరు సుభద్రం బనుచు సముద్రంబు గడచి మారీ
చునాశ్రమంబు సొచ్చి రథంబు డిగ్గి జటావల్కలధరుం డైనయన్నిశాచరుపాలి
కిం బోయి కనుఁగొనుటయు.

284


క.

మారీచుఁడు గనుకని నపు, డారక్షోవిభునిఁ బ్రీతి నర్చించి నయం
బారఁగఁ గ్రమ్మఱ వచ్చిన, కారణ మే మనినఁ బంక్తికంఠుం డెలమిన్.

285


వ.

శూర్పణఖ తనకుం జెప్పినవృత్తాంతం బతనికి సవిస్తరంబుగాఁ జెప్పం దలంచిన
వాఁ డై వెండియు నద్దశకంధరుం డి ట్లనియె.

286


సీ.

నక్తంచరోత్తమ నారాక విను రాముఁ, డనువాఁడు దమతండ్రి యలిగి పురము
వెడలఁద్రోచిన దపోవేషి యై పత్నియు, ననుజుండుఁ దోడ రా నరుగుదెంచి
దండకాటవి నుండి దర్పించి మ శూర్ప, ణఖఁ బట్టి ముక్కుఁగర్ణములుఁ గోసి
దాన నిల్వక జనస్థానంబునం దున్న, ఖరదూషణాదిరాక్షసులఁ గడఁగి
నిరవశేషంబుగాఁ జంపె నిఖిలలోక, జయుఁడ నగునాకు నె గ్గిట్లు సలిపెఁగాన
యేను నాక్షత్రియాధమునింతి సీతఁ, దెత్తు నీసహాయతఁ బగ దీర్తు నేఁడు.

287