పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

భారతదేశమున


చదువురాని అజ్ఞానులుగాక చదువ నేర్చిన ఆంగ్లవిద్యాధికులు దేశప్రజల కేవిధముగను తోడ్పడక విజాతీయప్రభువులకన్న దేశమునకు హెచ్చుఅపకారముచేయుటయు తటస్థించుచున్నది. విద్యాధికులలో చాలమందిసర్కారు నౌకరులుగనో సర్కారుపై నాధారపడిన వృత్తివంతులుగనో యుండి వ్యర్థులగుచున్నారు. ఇదియుగానిచో తామునేర్చినవిద్యవలని ప్రభావమున దేశభక్తిశూన్యులై, నిరాయుధులై అసహాయులైన కారణమున పిరికిపందలై పొట్టకూటికొరకు బ్రిటీష్‌ప్రభువులను మెప్పించుటకొరకు దేశద్రోహముకూడ చేయుటకు వెరవకున్నారు! రాజకీయార్థిక దాస్యముకన్న నీ వైజ్ఞానికదాస్యము మనజాతికి వేరుపురుగువంటిది. ఇట్లు మెకాలే మొదలగు బ్రిటిష్ రాజ్యతంత్రజ్ఞుల మనోరధము నేటికి సిద్ధించినది. ఆంగ్లవిద్యనేర్చిన భారతీయులలో చాలమంది పైనచెప్పిన కారణములవలన అస్వతంత్రులై తేజోవిహీనులై భారతీయవిజ్ఞానమునకు స్వాతంత్ర్యముసకు విముఖులుగానుండి యీ నిరంకుశబ్రిటిష్ ప్రభుత్వయంత్రమునకు సహాయులై దేశముయొక్క శాశ్వత దాస్యమునకు దారిద్ర్యమునకు తోడ్పడుచున్నారు.