పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల వడ్డీ వ్యాపారము

185


అభిప్రాయభేదములు కలిగినందున వారు తగుచర్యగైకొనక ఫిగట్టును పనిమాని యింటికి రమ్మనిరిగాని యీ ఉత్తరువు వచ్చు లోపలనే అతడు చెరసాలలో మరణించెను. ఈలోపుగా సర్ తామస్ రంబోల్డును అతని స్థానే గవర్నరుగా నియమించిరి. ఆర్కాటు నవాబునకు 1767 లో కంపెనీ యుద్యోగులిచ్చిన ఋణముగాక 1777 లో సైనికులజీతముల కతనికి మరల ఋణము కావలసివచ్చెను. అంతట కంపెనీ ఉద్యోగులు టైలర్, మెజెండీ, కాల్ అనువారు అతనికి ఋణ మిచ్చుట కంగీకరించి 16 లక్షల రూపాయలు అప్పుగానిచ్చి దానిక్రింద కొన్నిజిల్లాల ఆదాయము తాకట్టుపెట్టుకొని శిస్తు వసూలు చేసుకొనిరి. 1777 లోనే మరల కంపెనీనౌకర్లు నవాబునకు రెండుకోట్ల పై చిల్లర మూడవమారు ఋణమిచ్చినట్లు వెల్లడింపబడెను. ఈ అప్పు లన్నిటిపైనను నూటికి 36 మొదలు 48 వరకు అత్యధిక రేటు వడ్డీ నిర్ణయింపబడి యుండెను. ఈ సొమ్ము కంపెనీనౌకర్ల కెచ్చటనుండి వచ్చినదని విమర్శించు వారు లేరైరి. 1784 కు 1804 కు మధ్య ఈ నవాబుయొక్క ఋణమును పిట్టు, డండాసులు 480000 పౌనుల సాలుసరి వాయిదాలచొప్పున తీర్మానింపజేసిరి. ఆ తరువాత మరల నీనవాబునకు మూడుకోట్ల పౌనుల ఋణమైనట్లు నవాబును అతని ఇంగ్లీషు స్నేహితులును వెల్లడి చేయసాగిరి. అంత 1805-1814 సంవత్సరముల మధ్య నొక విచారణ సంఘ మేర్పరుపబడగా రెండుకోట్లలో లక్ష తొంబది వేల పౌనులు అబద్దపు ఋణమని తీర్మానించిరి. మొత్తము మూడుకోట్ల పౌనులలో 30 లక్షలు