పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

బసవపురాణము


పండితత్రయము

శ్రీపతిపండితుఁడు, శివలెంక మంచెన పండితుఁడు, మల్లికార్జున పండితుఁడు పండితత్రయమని పాల్కురికి సోమనాథుఁడు చెప్పినాఁడు.

హరభక్తియుత్పత్తి కధిపతి నాఁగఁ
బరగెను దొల్లి శ్రీపతి పండితయ్య
చెనసి భక్తి క్రియాస్థితికర్త యనఁగఁ
జనియెను లెంకమంచెనపండితయ్య
దూరాన్యసమయసంహారుఁడై చనియె
శూరుండు మల్లికార్జున పండితయ్య
ఖ్యాపితభక్తికిఁ గారణపురుషు
లై పండితత్రయంబన భువిఁ జనిరి.

- పండితారాధ్య చరిత్ర.

శ్రీపతిపండితుఁడు - (పుట. 210) ఈయన యాంధ్రుఁడు; బెజవాడ వాస్తవ్యుఁడు.

పశ్చిమచాళుక్యరాజగు నాఱవ విక్రమాదిత్యుని యొద్ద దండనాయకుఁడై పెక్కురాజ్యములను జయించిన యనంతపాలుఁడు కొండపల్లినాడు పాలించుచు బెజవాడలో నుండఁగా నీ శ్రీపతిపండితుఁ డాతనికి గురుఁడై యుండెను. అనంతపాలుని శాసనము బెజవాడకుఁ జేరువగానున్న చేఁబ్రోలఁగూడఁ గలదు. ఆతఁడు క్రీ.శ. 1095-1118 లో నుండెను. శ్రీపతిపండితుని మల్లికార్జున పండితారాధ్యుఁ డిట్లు ప్రశంసించినాఁడు.

క. ఒక్కఁడె దైవము శివుఁడని
   నిక్కము సేయుటకు ముడిచె నిప్పులు సీరన్
   స్రుక్కక శ్రీపతి పండితుఁ
   డక్కజముగ విజయవాడ నలజమ్మి శివా!