పుట:ప్రబోధచంద్రోదయము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరమీమాంస

వేదవ్యాసప్రతిపాదకము. ఇది జ్ఞానమార్గమునకు సంబంధించినది. ఆత్మ సత్యము. జగత్తు మిథ్యయను నద్వైతసిద్ధాంతమును తొలుత సిద్ధాంతీకరించిరి. వాసోద్దిష్టమైన ఉత్తరమీమాంసయే. ఇదియే "వ్యాససరస్వతి" అని ద్వితీయాశ్వాసమున పేర్కొనబడినది.

నైయాయిక వైశేషికమతము

ఈశ్వరుడు నిమిత్తకారణము. అట్టి ఈశ్వరు డున్నా డనుటకు జగము సావయము గావున ఘటాదులవలెనే పుట్టినది. ఘటాదిజననము దానిప్రయోజనము లెరింగినవానిచేతనే చేయబడును. కాబట్టి జగము నిర్మించునేర్పు గలవాడును, కర్మపరవశులైన జీవులకంటే విలక్షణుండగు నొకసర్వజ్ఞుఁ డుండవలయు నతడు సాధకము ఆతడే ఈశ్వరుడు. ఈశ్వరప్రీత్యర్థకముగా వేదోక్తకర్మంబుల నాచరింపుచు తత్ప్రసాదలబ్ధంబైన అష్టాంగయోగమున దుఃఖనివృత్తియైన మోక్షంబు బడయును.

ఈ మతప్రసక్తి తృతీయాశ్వాసమున గలదు.

కాపాలికమతము

ఇది శైవమతములోన నాంతరభేదము. ఈ మతానుయాయులకు, శివుని ననుసరించి కపాలబిక్షాటనము, శ్మశానవాసిత్వము, దిగంబరత్వము గలదు శైవమున సన్యాసము లేదు గాన నీమతస్థులు భార్యలతో నుందురు. ఈ మతానుయాయుని సోమసిద్ధాంతి యనియందురు.

కపాలబిక్షాటనము ప్రధానసిద్ధాంతముగాన వీరలకు కాపాలికులు అని పేరువచ్చినది.

ఇందు తృతీయాశ్వాసమున కాపాలికప్రసక్తియేగాక కాపాలినిప్రసక్తి వచ్చును. మతములో సాంఖ్యమతము గూర్చి యీ నాటకములో చెప్పబడలేదు.