పుట:ప్రబోధచంద్రోదయము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్తికమతములు

పాశుపతమతము

ఇది శైవాగమసిద్ధము. ఆగమములచే ననుగ్రలహీతుడైనవాడు శివుడు. ఈతడే జగములకు నిమిత్తకారణము పరమాణువులు ఉపాదానకారణము. శైవాగమమందు జెప్పబడిన కంఠిక, రుచకము, కుండలము, శిఖామణి, భస్మము, యజ్ఞోపవీతము అను నారుముద్రలను ధరించుటయు, సురాకుంభస్థాపనము, శ్మశానభస్మస్నానము, ప్రణతపూర్వకధ్యానము మొదలగు కర్మలచే నణుస్వరూపము నశించి జీవునకుగల మలత్రయము నివారించును. అది కారణమే శివసాయుజ్యము. అదియే మోక్షము.

పాశుపతులు నాటకమున తృతీయాశ్వాసమున పేర్కొనబడిరి.

ద్వైతము

ఈ మతమున ఈశ్వరునికి జీవునికి పరస్పరభేదము - మోక్షానందము తారతమ్యము జీవుడు పరతంత్రుడై ఈశ్వరానుగ్రహము వలన ఈశ్వరసామీప్యాదుల స్థితులను బొందును.

ఇం దీశ్వరు డనగా విష్ణువు. భగవత్కృపవలన ఆత్మకు మోక్షము గలుగుచున్నది. ఆయన సర్వోత్కృష్టత గుఱుతెఱిగినవారికి భగవత్కృప గలుగును. భగవత్ ధ్యానముద్వారా ఆత్మ లాయన కృపను బొందును. భగవత్ జ్ఞానము పొందుట కన్ని ఆత్మలకు సాధ్యముకాదు. మంచి ఆత్మలు జ్ఞానము పొంది భగవత్కృపను సంపాదించుకోనును, సర్వశక్తిగల భగవంతుడైన విష్ణుని సేవించుట వలన ఆత్మలు భగవత్ జ్ఞానము పొందును.

ఈ మతమువారు ద్వితీయాశ్వాసమున పేర్కొనబడిరి.

మీమాంసమతము

ఇది రెండు విధములు.


1.

పూర్వమీమాంస - జైమిని ప్రతిపాదకము, కర్మప్రాధాన్యము. ఇందుఖాట్ట ప్రభాకరములను రెండు తెగలు గలవు.