పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

37


వ.

ఇవ్విధంబున సుముఖుండై తరుణియుం దానును నప్పర్వతం
బునం దత్యంతసుఖంబు లనుభవించుచుండె నంత దుర్భిక్షంబు
దెలిసిన భృగుమహర్షియును శిష్యగణసమేతుండై క్రమ్మర వింధ్య
గిరిపాదావతీర్ణయగు రేవానదీతీరంబున నాశ్రమంబు నిర్మించు
కొని సుఖంబుండె నట్లు గావున.

170


క.

భృగుముని విద్యాధరునకుఁ
దగఁ జెప్పిన మాఘమహిమఁ దాత్పర్యముతోఁ
దగిలి విను పుణ్యపురుషుల
కగణితమగు శుభము లొదవు నఘము లడంగున్.

171


వ.

అని చెప్పి వసిష్ఠుండు దిలీపున కిట్లనియె. నీవు న న్నడిగిన
యట్టి యిమ్మాఘమాహాత్మ్యంబు తొల్లి కార్తవీర్యుం డడిగిన నత
నికి సహ్యగిరిమీఁద నుండి దత్తాత్రేయుం డిట్లని చెప్పె.

172

కార్తవీర్యునకు దత్తాత్రేయుండు చెప్పిన మాఘప్రభావము

క.

వినవయ్య! కార్తవీర్యా
ర్జున!మాఘముమహిమ మున్ను సురముని కమలా
సను నడుగ నాతఁ డతనికి
వినిపించిన తెఱఁగు నీకు వినిపింతుఁ దగన్.

173


ఆ.

ప్రకట[1]ధర్మభూమి భారతవర్షంబు
గాన నిందునున్న కారణమున
మనుజులకును మాఘమజ్జనవశమునఁ
గాక యొంట సుగతి గలదె చెపుమ?

174


క.

వ్రతదానతపములందును
మతి హరి ప్రియమందఁ డుదయమాఘస్నాన
వ్రతనియమంబులఁ బొందిన
గతి నరయఁగ రాజచంద్ర! గాంభీర్యనిధీ!

175
  1. కర్మ (తి)