పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

పద్మపురాణము


చ.

చదువులు నాలుగున్ జదివి సాంగముగా జపహోమకృత్యముల్
వదలక సల్పి వేదవిధివంతముగా హయమేధయాగముల్
పది యొనరించు తత్ఫలము పాయక చేకుఱు నిత్యమంగళ
ప్రదమగు భక్తి నొక్కపరి పద్మపురాణము విన్నవారికిన్.

82


వ.

అని చెప్పి మఱియును.

83


క.

పారాశర్యుని చరణాం
భోరుహములు భక్తిఁ దలఁచి పురుషోత్తము నిం
పార మది నిలిపి పద్మ
శ్రీరచనలు విస్తరించి చెప్పఁ దొడంగెన్.

84


సీ.

అఖిలలోకజ్యేష్ఠుఁడైన శతానందుఁ
       డనుపమంబైన సర్గాదియందు
సమధికంబైన దేవమనుష్యజంగమ
       స్థావరాత్మకమైన జగమునెల్లఁ
బుట్టించి బహువిధభూతసంఘములకు
       వలయు వృత్తులు గతు ల్వరుసఁ జేయ
నబ్భంగి జరగక యఖిలభూతంబులు
       దమలోన లోభమోహములు గదిరి


తే. గీ.

యధికు లధముల వృత్తుల నపహరించి
యొండొరులచేత నిహతులై యొఱపు దఱిఁగి
యశనకాంక్షలఁ గడు డస్సి యడఁగియున్న
జగముఁ గనుఁగొని సరసిజసంభవుండు.

85


వ.

పెద్దయుం బ్రొద్దు విచారించి తన శక్తివలన స్వాయంభువమను
వునుం బుట్టించి యతనిని సకలజగద్రక్షణార్థముగ నియమించి
ప్రజాపరిపాలనశక్తి ప్రసాదించిన నమ్మహాభుజుండునుం గమల
గర్భునకుం గృతాంజలియై యిట్లనియె.

86