Jump to content

పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

వీటిని సింగన 2446 గద్యపద్యాలుగా అనువదించి మరింత సంగ్రహం చేసినాడు. వీటినే సింగన "పద్మశ్రీ రచనలు" (I-84) అన్నాడు. మహాపద్మం విష్ణుసంభవం. బ్రహ్మ పద్మసంభవుడు. ఆతని మానసపుత్రుడు వసిష్ఠుడు. ఆతని మునిమనుమడు వ్యాసుడు (వ్యాసం వసిష్ఠనప్తారం). వ్యాసభగవానుడు పురాణప్రవచనం చేయటానికి పూర్వమే పద్మపురాణం మూడుసార్లు కథితము. 282 అధ్యాయాలున్న ఉత్తరఖండంలో చివరి 64 అధ్యాయాలు మడికి సింగన తెనిగించటానికి కారణం ఆ భాగం భగవద్రామానుజులకు అత్యంతప్రీతిపాత్రమైనది. మడికి సింగన రామానుజదయాపాత్రుడు. శ్రీవైష్ణవసిద్ధాంతప్రతిపాదనకు తెలుగులో కావ్యత్వం ఆపాదించే ప్రథమప్రయత్నం చేసినవాడు మడికి సింగన. సింగన అనువాదానికి మూలమైన సంస్కృతభాగం తెలుగులిపిలో రెండు సంపుటాలుగా మాఘమాహాత్మ్యం పేరుతో భువనగిరి చెన్నకేశవులు 1889 లోను, పాద్మోత్తరఖండం పేరుతో తెన్మఠం శ్రీరంగాచార్యులు 1936లోను ప్రకటించినారు.

మడికి సింగన తాను అనువదించిన భాగం కథాక్రమానికి భంగం కలుగకుండా పూర్వ మధ్యమఖండాలలో కథలను సూచనమాత్రంగా తెల్పి కందనామాత్యుని కోరిక (I-61) తీర్చినాడు. బ్రహ్మదేశంతో వసిష్ఠుడు ముందుగా స్వాయంభువు మనువుకు, అటు తరువాత వైవస్వతమన్వంతరంలో దిలీపమహారాజుకు పూర్వ మధ్యమ ఖండాలు వినిపిస్తాడు. దిలీపుని అశ్వమేధపరిసమాప్తితో ఉత్తరఖండం ప్రారంభం ఔతుంది. ఈ ఉత్తరఖండం కూడ ఉన్నదున్నట్లు సింగన తెనిగించలేదు. మాఘమాహాత్మ్యాన్ని, హరిపారమ్యాన్ని తెలిపే భాగాలనే ఆంధ్రీకరించినాడు. మాఘమాహాత్మ్యం తెలిపే పునరుక్తులు సువ్రతుని వృత్తాంతము, గజమోక్షం, పుష్కరునిచరిత్ర వంటివేకాక శివాధిక్యం తెలిపే మార్కండేయచరిత్రం, శివరాత్రిమాహాత్మ్యం, శివరాత్రివ్రతవిధానం, భీమసేనవృత్తాంతం, మృగశృంగోపాఖ్యానం, తీర్థమాహాత్మ్యాలు, మానసతీర్థాలు, సౌభరిచరిత్ర మొదలైనవాటిని విడిచిపెట్టినాడు. సింగనది స్వతంత్రానువాదమని చెప్పవచ్చు. శాస్త్రవిషయాలను స్తోత్రాలను సంగ్రహించి కథాగతిని పోషిస్తూ, వివిధధర్మాలను బోధించటానికి సన్నివేశాలు