పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనిన నతండు రూక్షేక్షణుండై యతిత్వరితగతిం బఱచి రాజద్వారంబున నాక్రోశిం
ప నమ్మహీశ్వరుండు ధర్మాధికారులం బిలువం బంచి విచారింపుం డన వారును నవ్వై
శ్యునిఁ దన్నిమిత్తం ఒడిగిన నతం డిట్లనియె.

549


గీ.

సెట్టి దొంగ యొకఁడు శీఘ్రమ నాపట్టిఁ
బట్టి చంపి పక్షి పట్టుకొనుచుఁ
బాఱిపోయె ననియె భావింపరయ్య యీ
యాగడంబు భూమియందుఁ గలదె.

550


వ.

అనిన విని ధర్మాధికారు లీకార్యం బతర్కితం బిది విచారింపం దగు నని ప్రతివాది
వైశ్యునిం బిలువం బంచి యవ్విధం బడిగిన నతం డిట్లనియె.

551


క.

వేయితులాలం గలిగిన
యాయిను మితనింట నిడిన నది యెలుకలచేఁ
బోయె ననెఁ జిన్నపాపని
నాయతగతి గ్రద్ద కొనుచు నరుగుట యరుదే.

552


చ.

అని పలుకంగ నాసభికు లప్పు డెఱింగి యితండు సెట్టి నీ
యిను మొసఁగుం గుమారకుని నిమ్మని వారలు చక్కఁబెట్టినన్
మనమున సమ్మతించి మఱుమా టన కాసభవారు తీర్చి చె
ప్పినగతి నట్లు చేసి రని పెం పెసఁగన్ గథ చెప్పి యిట్లనున్.

553


క.

మతిమంతుఁ డైనవానికి
హితముగ నొకమాట చెప్ప నెఱిఁగి చరించున్
ధృతి దఱుఁగ నీవు నేలా
ప్రతిమగతిం జేష్ట దక్కి బ్రమసితి గంటే.

554


వ.

కావున నీకు నేకార్యంబును నుపదేశింపం బనిలేదు నిన్నుఁ గూడుట యనుచితంబు.

555


గీ.

సుజనదుర్జనసంగతిఁ బ్రజలు నడవ
గుణములును దుర్గుణంబులుఁ గూడి పరఁగు
వరుస బహుదేశసంచారవాయువులకు
గంధదుర్గంధములు వచ్చి కలసినట్లు.

556