పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నృపుఁడు గుణి యైన సచివుఁడు, కపటాత్ముం డైనఁ బ్రజలు గదియరు వానిం
జపలమకరాశ్రయం బగు, విపులసరోవరముఁ జేర వెఱచినభంగిన్.

483


వ.

అని మఱియును.

484


ఉ.

ఆసల నీశుభంబునకు నక్కట యీ విభు నొంటివానిఁగాఁ
జేసితి గాని సేవకులఁ జేరఁగ నీవు ప్రజాసమృద్ధి ను
ద్భాసితుఁ జేయ కంతయును దా నయి యున్నయమాత్యుఁ డెంతవి
శ్వాసము గల్గెనేని నరవర్యునకున్ బగవాఁడు దా నగున్.

485


క.

పరుసనివానికి మదిహిత, మరుదుగ నొనరించు నెవ్వఁ డితఁ డమృత మగున్
బురుషవరేణ్యున కెవ్వఁడు, వెరవిడియై కీడు సేయు విష మగు నతఁడున్.

486


వ.

కావునఁ బురుషుల కహితం బాచరించు తలంపునఁ బ్రవరిల్లునీవు బుద్ధిహీనుండ వని
పలికి కరటకుండు మఱియు నిట్లనియె.

487


సీ.

కడఁగి మనోవాక్ప్రకారంబు లేకంబు, గాక మిత్రునిఁ గూడి కడఁగునతఁడుఁ
బ్రతిదినప్రఖ్యాతపాపవర్తనమునఁ, దగిలి ధర్మము చేయఁ దలఁచునతఁడు
నేపార నెపుడుఁ బరాపకార మొనర్చి, పృథు సంపదలఁ గూడఁబెట్టునతఁడు
సమధికం బగుదేహసౌఖ్య మపేక్షించి, చెలఁగి విద్యల నభ్యసించునతఁడుఁ


గీ.

బరుసఁదనమున నేప్రొద్దుఁ బద్మముఖులఁ, బొసఁగ వలపింతు నని తలపోయునతఁడు
నెఱుక చాలనివా రని యిద్ధరిత్రి, నెఱయ నూహింతు రనిశంబు నీతివిదులు.

488


క.

స్వామిప్రసాదసంపద, వేమఱు మదిఁ గోరువానివిభవం బమరున్
స్వామి ప్రసాదసంపద, వేమఱు మదిఁ గోరకుండువీఱిడి చెడెడున్.

489


క.

ఏరాజు తనదుభృత్యుని, కారుణ్యమువలనఁ బ్రతుకగాఁ జూచి మదిన్
వారక శంకితమతి యగు, నారాజువిధంబు నీచ మగు ననుదినమున్.

490


గీ.

అర్థశాస్త్రంబు చదువనియట్టివాని, పుత్త్రుఁడును దండ్రిగణములఁ బోలి పొలుచు
జగతిఁ గేతకీవృక్షసంజాతఫలము, బహుళకంటకములచేతఁ బ్రబలినట్లు.

491


వ.

కావున నీకుం జెప్పఁదగినబుద్ధి యేమి యున్నది విను మని యిట్లనియె.

492


చ.

నెఱయఁగ వంపరానిధరణీజము వంపఁగడంగెనేని నే
డ్తెఱ బలుఖడ్గధార జగతీధరశృంగము వ్రేసెనేని మీఁ
దెఱుఁగక బుద్ధిహీనునకు నెంతయు బుద్ధులు చెప్పెనేని చె
చ్చెర నొకవానరంబునకుఁ జెప్పినసూచిముఖంబుచా డ్పగున్.

493


వ.

అనిన విని దమనకుండు తత్కథాక్రమం బెట్టి దని యడుగఁ గరటకుం డిట్లనియె.

494