పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మత్తకోకిల.

మీర లున్నెడ కేఁగుదెంచితి మేలు మీ కొకఁ డెద్దియేన్
గోరి చేసెద నందు దొడ్డును గొంచెముం దలపోయకుం
డేరి కిందు నసాధ్య మైనది యిత్తు నుత్తములాగ నా
వార లెవ్వరు మీరు గా కని వైనతేయుఁడు పల్కినన్.

465


గీ.

పక్షు లెల్ల విహంగమపతికి మ్రొక్కి, జలధి టిట్టిభములకును జలముతోడిఁ
గీడు చేసినపని యెఱిఁగింప నెఱిఁగి, యమ్మహాత్ముండు పక్షుల కభయ మొసఁగి.

466


వ.

క్షీరాబ్ధిమధ్యగతం బగు వైకుంఠంబునకుం జని తన్మధ్యంబున దివ్యసుధాభవనం
బునఁ బన్నగతల్పంబున నున్న పురాణపురుషుం బుండరీకాక్షుం గని సాష్టాంగ
నమస్కారపూర్వకంబుగా బహువిధస్తోత్రంబుల బ్రసన్నుం జేసి తనకులస్వాము
లకుం జేసినయర్ణవదుర్ణయంబు విన్నవించిన.

467


సీ.

నీలాంబుదచ్ఛాయ నెఱసినమేనితో, రమణీయపీతాంబరంబుతోడ
శంఖచక్రాదికోజ్జ్వలహస్తములతోడ, ధవళాబ్జతులితనేత్రములతోడ
వనమాలికాంకితవక్షస్స్థలంబుతోఁ, బ్రవిమలకౌస్తుభప్రభలతోడ
శోభితోభయపార్శ్వసురసమూహంబుతో, సిద్ధవిద్యాధరశ్రేణితోడ


గీ.

గరుడవాహనారూఢుఁ డై కైటభారి, రయముతో వచ్చి యుదధితీరమున నిల్చి
యండజంబులు మ్రొక్కిన నభయ మొసఁగి, జలధరధ్వనిఁ గే లెత్తి జలధిఁ పిలిచె.

468


చ.

పిలిచిన నంబుధీశ్వరుఁడు పెం పెసలార ముకుందు మందరా
చలధరుఁ గాంచి సద్వినయసంభ్రమ మొప్పఁగఁ జాఁగి మ్రొక్కినన్
జలరుహలోచనుం డనియెఁ జయ్యన నీవు హరించినట్టిపి
ల్లలఁ గొని రమ్ము పక్షులవిలాపము మాన్పుము నేఁడు మాకుఁగన్.

469


క.

అనినన్ జలధి ప్రసాదం, బని వేగమ తెచ్చి టిట్టిభాండంబుల న
వ్వనజోదరుముందట నుం, చినఁ గైకొని యతని ననిచి శ్రీపతి పేర్మిన్.

470


వ.

అయ్యండంబు లయ్యండజంబుల కిచ్చి యంతర్హితుఁ డయ్యెఁ డిట్టిభంబులు పూర్వ
ప్రకారంబున నచ్చోట సుఖంబున నుండె నని చెప్పిన సంజీవకుండు మృగేంద్రుం డే
భావంబున యుద్ధసన్నద్ధుం డగు ననిన దమనకుం డిట్లనియె.

471


క.

మునుగాళ్లు రెండు తోఁకయు, ఘనములుగా మీఁది కెత్తి కడు వివృతముగా
నొనరించినవదనముఁ గని, మనమునఁ దలపోయు కలహమతిఁగా నతనిన్.

472


వ.

అని చెప్పి దమనకుండు కరటకుం డున్నయెడకుం జని మన ముద్యోగించిన కార్యంబు
సఫలం బయ్యె నన్యోన్యభేదంబులు పుట్టె నని చెప్పి యతనితో మఱియు నిట్లనియె.

473