పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈపిన్నవాని నిప్పుడు, వేపడినం జంపు వాఁడు శీఘ్రమ దోషా
రోపంబున కర్హుం డై, కోపము పాపంబుపొత్తు కువలయనేత్రా.

454


క.

వీనిం దండ్రిని గూర్పక, మానుగ నను గూర్చి మిగుల మన్నించితి ప
ద్మానన నీసరి లే రని, తా నప్పుడు గొల్ల మెచ్చెఁ దనకులకాంతన్.

455


వ.

కావున గోపాంగనయుఁ బ్రత్యుత్పన్నమతి యై తనముప్పు దప్పించుకొనియె నట్ల
మనమును నప్పటికిం దగినకార్యం బనుసంధింత మని యూరకున్న యనంతరంబ యనా
గతవిధాత యనుమత్స్యం బెడతెగని జలప్రవాహమార్గంబున నన్యజలాశయంబునకుం
బోయె నమ్మఱునాఁడు.

456


గీ.

మత్స్యఘాతుకు లేతెంచి మడువు సొచ్చి, మొదలఁ బట్టిన మీలను గుదులు గ్రుచ్చి
యీడ్చి తిరుగంగ నప్పుడు హెచ్చి గుదికి, నడుము గబళించి జీవంబు విడిచినట్లు.

457


క.

అనువున నుండఁగ నొండొక, వనజాకరమునకు నేఁగి వారలు గుదులం
బెనురొంపి పోవఁ దొలఁచినఁ, జనెఁ బ్రత్యుత్పన్నమతి నిజం బగుకడఁకన్.

458


వ.

అంత యద్భవిష్యుం డెటఁ బోదు నేమి సేయుదు నని విచారించుసమయంబునం
బట్టువడి మృతిం బొందె నని చెప్పి టిట్టిభాంగన కొన్ని దివసంబులకుఁ బ్రసూతి యైనఁ
దత్ప్రతిజ్ఞాభంగంబు సేయంగలవాఁడై సముద్రుం డయ్యండంబుల నపహరించిన.

459


క.

ఆపక్షీంద్రకులాంగన, దీపించిన శోకజలధిఁ దేలుచుఁ బతితో
నాపలుకులు వినవైతివి, పాపాత్మసముద్రుచేతఁ బడఁ బాలైతిన్.

460


ఉ.

అవ్వల నెన్ని లే వట మహాగహనైకనికుంజవృక్షముల్
దవ్వున నిప్పు డున్నయదె తా మన కుండఁగఁ గాణయాచియే
యివ్విధ మేను ము న్నెఱిఁగి యెంతయుఁ జెప్ప ననాదరంబుతో
నవ్వితి గాని పట్టదు మనంబున మీఁదటిహాని ధీనిధీ.

461


వ.

అని పరిదేవనంబు చేసిన తన ప్రాణవల్లభ నూఱార్చి దానివిభుం డగు పక్షి యిట్లనియె.

462


చ.

వెఱవకు కాంత నన్ను నవివేకి యితం డని నీవు చూడ కే
డ్తెఱ భువనప్రపంచమునఁ ద్రిమ్మరుపక్షులఁ గూర్చి నీవు ని
వ్వెఱపడఁ బక్షివల్లభుని విష్ణునిఁ దెచ్చి యపత్య మిప్పుడే
నెఱయఁగఁ దెచ్చి యిచ్చెద ననింద్యచరిత్ర విచార మేటికిన్.

463


మ.

అని యాటిట్టిభ మప్పు డేఁగి తనకార్యం బుర్విపైఁ గల్గుప
క్షినికాయంబున కేర్పడం తెలిపి భక్తిం బక్షులుం దానుఁ బు
ణ్యునిఁ బక్షీంద్రుని వేఁడుకో నతఁడు నన్నున్ మీర లెల్లం దలం
చి నమస్కారము లాచరించినను మచ్చిత్తంబు రంజిల్లుటన్.

464