పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూర్వకంబుగా నిట్లనియె.

398


క.

ఎవ్వరు నేటికి నామెయిఁ, గొవ్వినమాంసంబు గలదు కొను మాఁకలియున్
నొవ్వియును దీఱు నంతట, నవ్వల నారోగ్య మగు మృగాధిప నీకున్.

399


వ.

 అని శార్దూలంబు పలికిన మృగేంద్రుం డిట్లనియె.

400


ఉ.

గోవుల విప్రులం దఱిమి కూడఁగ ముట్టి భుజించి తచ్ఛరీ
రావృతమాంసపోషణమునం దనిశంబును మేను పెంచుటన్
గా విటువంటికల్మషనికారపుమేనులు భక్ష్యభోజ్యముల్
నీవు దొలంగు మాఁకటికి నేఁడును నోర్చెద వ్యాఘ్రపుంగవా.

401


వ.

అని మదోత్కటుండు పలికినఁ బుండరీకంబు సలజ్ఞావనతవదనఖిన్నత్వంబునం దొలఁగి
చనినఁ దదనంతరంబ కథనకుం డతనిం గదియం జని మచ్ఛరీరంబున భవదాత్మరక్షణం
బు గావింపం దగునన్న నాక్షణంబ.

402


క.

వడి నుఱికి లొట్టిపిట్టను, మెడఁ గోఱలఁ గఱిచి పట్టి మేదినిమీఁదం
బడఁ దిగిచిన శార్దూలము, నొడఁగూడిననక్క తాను నుదరము వ్రచ్చెన్.

403


వ.

వ్రచ్చి తచ్ఛరీరమాంసంబు మృగపతికిం బెట్టి తచ్ఛేషంబు గోమాయువ్యాఘ్రకాకం
బు లనుభవించెఁ గావునఁ క్రొత్తగాఁ గొలిచినసేవకుం డెంతబలవంతుం డయ్యును రా
జునకును బరివారంబునకును హత్తనేరఁ డత్తెఱంగున నన్నుం జూచి తెలియం బలికి
వెండియు సంజీవకుం డిట్లనియె.

404


క.

సన్నపువారల నధిపతి, మన్నించినఁ బ్రాప్తుఁ డైనమంత్రికి బ్రతు కే
మున్నది మునుము న్నతఁడును, సన్నకసన్న నటఁ బాసి చనకున్నఁ జెడున్.

405


వ.

అని మఱియును.

406


సీ.

చెలఁగి మానససరసీతటంబున నొక, గ్రద్ద హంసములలోఁ గలసి యుండ
నదియును నొకవన్నెహంసంబు గాఁబోలు, ననుచుఁ జూచినవార లాత్మఁ దలఁతు
రొక్కటి కలహంస యూరిచేరువఁ బ్రేత, భూమి గృధ్రంబులఁ బొందుపడినఁ
గనులొని గృధ్ధంబుగాఁ దలంతురు గాని, రాయంచ యనువిచారంబు రాదు


గీ.

గానఁ దగువార లున్న భూకాంతునొద్ద, నల్పు లైనను గుణవంతులై భజింతు
రధిపు నొద్దను హీనాత్ము లలమికొనిన, భవ్యగుణుఁ డైననధిపతి ప్రకృతిఁ దొలఁగు.

407


వ.

అని సంజీవకుండు రాజునకు నాకును నన్యోన్య భేదం బెవ్వఁడో పుట్టించె దురాత్ముం
డైనవాఁడు నిజంబు కల్లయుఁ గల్ల నిజంబుఁగా మహేశ్వరునకుఁ జెప్ప నెవ్వరి నేమి
సేయఁ డతనిదయావిశేషంబు నామీఁద శిథిలంబయ్యెఁ గార్యంబునుం దప్పె నేమి సే
యుదు నని మఱియు నిట్లనియె.

408