పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

వాటు దాఁకి ముక్కు వ్రయ్యలై పడె నంచు, ముదిత కోకకొంగు మూసికొనుచు
వాడవాడ లెల వడి వెంటఁ దగులంగఁ, బోయి రాచనగరఁ గూయుచుండ.

201


గీ.

అపుడు దౌవారికులు విని యవ్విధంబు, నృపుని కెఱిఁగింపఁ బిలిపించి నెలఁతఁ జూచి
యిత్తెఱంగున కేమినిమిత్త మనిన, జనపతికి విన్నవించె నిజంబు తోఁడ.

202


ఉ.

తప్పొకయింత లేదు తను దైవము గాఁగఁ దలంతు నేను దా
నొప్పక నాయెడం గినియుచుండు నకారణవైర మూని నేఁ
డిప్పుడు ముక్కు గోసె ధరణీశ్వర యీ దురవస్థ నేమిగాఁ
జెప్పుడు నీవ దిక్కనుచుఁ జేరితి నామొఱ యాలకింపవే.

203


వ.

అనిన విని భూమీశ్వరుండు నాప్రొద్ద నాపితుం బిలిపించి వాని కిట్లనియె.


గీ.

ఓరి నీభార్య కేలరా యూర కిట్లు, వికృతవేషంబు చేసితి వెఱపు మాలి
యనిన వాఁడు భయంపడి మనుజపతికి, నొండు పలుకంగ నేరక యూరకుండె.

204


క.

ధరణీశ్వరుండు నంతటఁ, బరిజనులం జూచి వీనిఁ బట్టుకొనుచు మీ
రరిగి నగరంబువెలుపల, నరణ్యదేశమునఁ జంపుఁ డని పనుచుటయున్.

205


వ.

అంత భిక్షుకుండు తద్వృత్తాంతం బంతయు నెఱుంగుం గావున నమ్మహీశ్వరుసమ్ము
ఖంబున నిలిచి యాశీర్వాదపురస్సరంబుగా నతని కి ట్లనియె.

206


గీ.

మేషయుద్ధమధ్యంబున మెలఁగి యొక్క, శివయు నాషాఢభూతిచేఁ జిక్కి నేనుఁ
దొడరి సాలీనిసతిచేత దూతికయును, ముప్పు గను టాత్మకృతదోషములనె యనుచు.

207


ఉ.

చెప్పిన నద్భుతం బెసఁగ శీఘ్రమె నాపితుఁ బిల్వఁ బంచి యే
తప్పును లేదు పొ మ్మనుచుఁ దత్తరుణిం బురి నుండకుండఁ బెం
పొప్పఁగఁ దోలఁ బంచి సుజనోత్తము భిక్షుకు నిచ్చ మెచ్చెఁ దాఁ
జొప్పడ భూమిపాలుఁ డని సౌం పెసఁగం గథ చెప్పినంతటన్.

208


వ.

కరటకుండు నీ వింకఁ జేయఁదలఁచినకార్యం బెయ్యది యనిన నతం డతని కిట్లనియె.

209


గీ.

దృష్టముగఁ గార్య మంతయుఁ దెలియుకొఱకు
నెసఁగులోకప్రవర్తనం బెఱుఁగుగొఱకుఁ
దుది ననర్థకార్యంబులఁ ద్రోచుకొఱకుఁ
దగిన దెయ్యది యదియ మంత్రంబు సుమ్ము.

210


ఉ.

కావున మంత్రభిన్న మయి కార్యము దప్పక యుండ నిఫ్డు సం
జీవకపింగళాఖ్యులకుఁ జేరక భేదము పుట్టునట్లుగా
నేవెర సైనఁ జేయక సహించిన నవ్విభుఁ జేరవచ్చునే
సేవకకోటికిన్ మనకు సీమ దొలంగుట గాక యిత్తఱిన్.

211