పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అమ్మహాధ్వని విని యత్యంతభయముతో, మృగధూర్త మట్టిట్టు మెదల వెఱచి
కను మూసి తెఱవ కెక్కడఁ జొత్తు నని బుద్ధి, శోకించి కను విచ్చి చూచునంత
ధారుణిఁ బడి యున్న భేరీముఖంబునఁ, దరుశాఖ గాలిచేఁ దాఁగుచుండఁ
బొడగని తనలోనఁ బొడమినభయ మెల్లఁ బోయిన నా భేరి డాయ వచ్చి


గీ.

యప్పు డిది గాన నేరక యధికభీతిఁ, బాఱిపోవఁగఁ జూచితిఁ బట్టు విడిచి
సొలవ కిది భాగ్యదేవత చూపె నాకు, ననుచు నానక్క యాత్మ ని ట్లని తలంచె.

150


గీ.

ఇది మహాభోజ్య మిచ్చట నొదవె నాకు, నిప్పు డిది వ్రచ్చుకొని చొచ్చి హిత మెలర్ప
వలయుమాంసంబు భక్షింపవచ్చు ననుచు, సొలవ కాభేరి వ్రచ్చి తాఁ జొచ్చి చూచి.

151


వ.

ఆమృగధూర్తం బందు నేమియుం గానక వృథాస్థూలం బని పోయెం గాన శబ్దమా
త్రంబునకు శంకింపంబని లే దెచ్చట శబ్దంబు వినంబడె నచ్చటికిం బోయి తెలిసికొని
వచ్చెదం బనుపు మని యతండు వనుప సంజీవకుం డున్నయెడకుం బోయి యి ట్లనియె.

152


సీ.

ఎఱుఁగు మృగేంద్రునిహితభృత్యుగా నన్ను, నతఁడు నీయున్నెడ కరుగు మనిన
వచ్చితి నాతఁ డివ్వనజంతుకోటికి, నధిపతి గావున ననఘ నీవు
నాయనపంపు చేయక యొంటిఁ దిరుగుట, తగవు గా దతనిపాదములు గనుము
మంత్రి వై తత్కార్యతంత్రంబు తీర్పుము, వెఱవక రమ్మన్న విని యతండు


గీ.

సమ్మతించిన మృగపతిసమ్ముఖమునఁ దాను మును నిల్చి మృగనాథ యేను బోయి
మున్ను నీవిన్నశబ్ద మిమ్ముగ నెఱింగి, తెలిసి వచ్చితి నీ పాదములు భజింప.

153


వ.

అది కావించినయతండు దేవర మన్నింప నర్హుం డని చెప్పి మఱియు నిట్లనియె.

154


సీ.

అడరి మహాబలుం డధికసత్త్వంబున, నురుతరువ్రజముల నురులఁ గొట్టి
నీచంబు మృదువువై నెరయ నానత మైనకసవుఁ బెల్లగిలంగ విసర నొల్లఁ
డబ్బంగి నధికుండు నల్పులదెసఁ బోక, ఘనత రారాతుల గండడంచు
నట్లు నీవును మహాహంకారమృగములఁ, దగిలి సాధింపంగఁ దగుదు గాన


గీ.

సాధుజంతుమాత్రంబుల బాధపఱిచి, యుదరపోషణ మొనరించుచున్న హరులు
సాటి సేయంగఁ దగునె యీజగతి నీకు, శౌర్యగుణధామ మృగకులసార్వభౌమ.

155


క.

అని కీర్తించుచుఁ దమనకుఁ, డనఘా నీ వపుడు వినఁగ నార్భట మటఁ జే
సినయాతఁడు సంజీవకుఁ, డనఁ జనువృషరాజు సౌమ్యుఁ డనఘుఁడు బుద్ధిన్.

156


తరల.

అతఁడు నీకును మంత్రి గాఁదగు నాయనం గొనివత్తు నే
నతులవిక్రమ పోయి వచ్చెద నన్న నాతఁడు పొమ్మనన్
వితతవాక్యవివేకసంపద వింతభావము మాన్చి తాఁ
జతురతన్ వృషభేంద్రు సింహముసమ్ముఖంబునఁ బెట్టినన్.

157