| మ. | కమలాధారుఁడు భీతిదూరుఁ డసమాకారుండు గంభీరుఁ డ | 1 ఆ. 86 ప. |
ఇట్టివి సూక్ష్మదృష్టిఁ గనుఁగొనినచో నీతనికృతులం బెక్కులు గన్పట్టును. అయినను గథాసందర్భమున దీనిని పరమార్ధ మని తలంచి రసభావాదులం దిగనాడి, క్లీష్టార్థకల్పనైకశరణంబు లగుచిత్రబంధయమకాదులకొఱకుఁ గష్టపడక యాశ్వాసాంతమున మాత్రమీ వ్యావృత్తినియమమును గైకొనినాఁడు. ఇట్టిలక్షణములు విశేషముగ నాంధ్రపంచమవేదంబునఁ జూపట్టును.
ఈ కావ్య మీతని ప్రథమకవిత యగుటం జేసి దీనియందు భారతమందలి కవితాప్రౌఢిమ యంతగాఁ గానరాకున్నను మొత్తముమీఁద భారతశైలిం బోలియే యున్నది. కాఁబట్టియే యిందలి పద్యంబులయందుఁ దిక్కన కత్యంతగౌరవ ముండి యుండెను. దీనికిఁ దనభారతంబున నిందలి కొన్నిపద్యంబులఁ గొంతవఱకు మార్చియు మార్పకయుఁ బొందుపఱిచి యుండుటయే ప్రమాణము.
విస్తరభీతిచే వాని నిట నుదాహరింపక విరమించితి. ఇక్కవీంద్రుఁడు నన్నయభట్టసంప్రదాయానుసారముగఁ గావ్యాదిని సంస్కృతశ్లోకరూపంబుగనే మంగళాచరణం బొనర్చెను. షష్ఠ్యంతములు మానెను. దీని బట్టి యేతద్వైకల్పికత్వంబు గవి కిష్ట మని తోఁచుచున్నది. ఈ కవివల్లభుంగుఱించి వ్రాయఁదగునంశము లనేకము లున్నను, విస్తరభయంబునను ముఖ్యముగా నవి భారతమునకు సంబంధించిన వగుటను విరమించుచు స్థాలీపులాకన్యాయంబుగ రెండుపద్యముల నిట నుదాహరించుచున్నాఁడ.
| మ. | కుచముల్ వాఱెడినీటిమీఁదివిలసత్కోకంబులం గ్రేణి సే | 8 ఆ. 37 ప |
| శా. | ఏమేమీ రఘురామతమ్ముఁడవె మీ రేపారి పైనెత్తి మా | 10 ఆ. 17 ప. |
ఇట్లు సరసగుణమణిగణభూషణభూషితకవితావనితామణి మధురశృంగారవిలసితంబుల రసికవరేణ్యు లనురక్తి ననుభవించి యానందాంబునిధిరంగతరంగంబుల డోలాకర్మ నాచరింతురు గావుత మని ప్రార్థించుచున్నాఁడ.
ఉత్పల వేంకటనరసింహాచార్యులు