పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15

దండకము. వంచనాచుంచురత్వంబున న్నీపదాంభోజముల్.

ఇట్టివి మఱియుఁ గొన్ని గలవు. ఇవి యెట్లు దొరలెనో గానీ కవియజ్ఞతచేఁ బ్రయోగింపఁబడినవని చెప్పసాహసింపఁదగదు. మొత్తముమీఁదఁ గవిత్వము నిర్దుష్టమనియే చెప్పవచ్చును. మఱియు నిందు యతిప్రాసములయందు గురులఘురేఫభేదము పాటించినట్లు కనఁబడదు. ఇందలి పద్యగద్యములు చాలభాగము సంస్కృతపదభూయిష్టములై యున్నవి. కొన్నిచోట్లఁ దేటతెలుఁగుమాటలతో నలరారు వాటములగు పద్యములును గలవు. అందందు రూఢిపదములకు మాఱుగఁ బర్యాయపదములు ప్రయోగింపఁబడియుండుటచేఁ బద్యపఠనోత్తరకాలార్థావబోధమున కవి యించుక ప్రతిబంధముఁ గలుగఁ జేయుచుండును. అయిన నది యొక గొప్పలోపముగాఁ బరిగణింపఁజనదు. ఈ గ్రంథము పెక్కుతెఱఁగులఁ జాలఁ బ్రశస్తమైన దనియే తుదకుఁ జెప్పవలసినమాట. తినఁబోవువారికి రుచులు సెప్ప నేల యను తలంపుతోడను, ఆయాసందర్భములయం దింతకుము న్నుదాహృతములైన పద్యములే చాలు ననునాశయముతోడను గవితారీతిని దెలుపుటకై మరలఁ బ్రత్యేకముగాఁ గొన్నిపద్యము లెత్తి వ్రాయ లేదు. పాఠకమహాశయు లీగ్రంథమును సాంతముగఁ జదిని యిందలికవితారసము నాస్వాదించి యాంధ్రసాహిత్యపరిషత్తువారి పరిశ్రమము ఫలవంత మొనర్చుట యుభయతారకము. గ్రంథవిస్తృతి యేల?

కవితావిలాసముఓలేటి వేంకటరామశాస్త్రి
పీఠికాపురము