జరిగింది. అంతేకాదు హిరణ్యకశిపుని పరిపాలనను వర్ణిస్తూ సమస్తదిశలను సైతం చక్రంగానే నరసింహకవి పేర్కొన్నాడు. "చక్రమును బోలి జితదిశాచక్రమునను" (నార. 429. పు. 159. ప.) కాగా దిశలన్నిటినీ కలిపి చూచినపుడు చక్రాకారంలో కనిపించడం అవాస్తవికమైన విషయంకాదు.
హిరణ్యకశిపునికి అంతరంగికంగా విష్ణుద్వేషం లేదని, బహిర్నాటకంగానే విష్ణుద్వేషాన్ని ప్రకటించాడని విశిష్టంగా గతంలో గుర్తించాం సనకాదులకు మోక్షప్రాప్తివిధానం గురించి తెలియచేసిన సందర్భంలోనే అసలు రాక్షసులందరూ కూడా అంతరంగికంగా సద్దృష్టితోనూ, బాహిరంగా దుష్టదృక్పథంతోనూ సురద్వేషులై తనలీలవల్లనే వ్యవహరిస్తారని మహావిష్ణువు పేర్కొంటాడు.
| "నా మాయామయమోహిని | |
అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతి నొందుచుఁ దామసులు తన వారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్యయంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుంబలె నటించి మత్పదాంభోజంబు లందెదరు. బాహ్యంబున నసురతాఖ్యాతికై సురల బాధించెదరు" (నార. 416, 417. పు. 99, 100. ప. 101. వ.)