పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపకవిశేషావభోధంబు గలుగుం గాన విష్ణు గాయత్రియం దాద్యం బీమంత్రంబు" (నార. 98. పు. 18. వ.) అని పేర్కొన్నాడు.

పుష్పకవిమానం గురించి దాని వైశిష్ట్యం గురించి చాలామంది పండితులకు తెలుసును. అయితే శ్రీహరి దివ్యవిమానానికున్న వైశిష్ట్యం పుష్పకవిమాన వైశిష్ట్యంకంటే మహత్తరమైన వైశిష్ట్యం కలది. బ్రహ్మ శ్రీహరి దివ్యవిమానాన్ని పూజించే సందర్భంలో 40 లక్షల మైళ్ల ప్రమాణంకల ఆ విమానం పంచపురుషమాత్రారూపానికే పరిమితమైనదని, శ్రీహరిసైతం స్వలీలతో తదంతఃపరిమితరూపాన్ని పొంది నిలిచాడని నరసింహకవి వర్ణించాడు. (నార. 109. పు. 85. ప.)

శ్రీహరివలెనే లక్ష్మీమాత సర్వకామవరప్రదాయని అన్న సంగతి అందరికి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు ఆయుధాలలో వొకటైన 'సుదర్శనం' శత్రుసంహారంలో తిరుగులేనిదన్న సంగతి కూడా ఆర్షవిజ్ఞానులైన వారందరికీ పూర్తిగా తెలుసును. సుదర్శనప్రయోగానికి వ్యతిరేకంగా యెవరైనా యేదైనా ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం చేసిన వ్యక్తి అస్త్రశస్త్రసన్యాసం చేసి దాసోహం అని అననైనా అనాలి, లేదా సుదర్శనశక్తికి ప్రాణాన్ని బలిగానైనా యివ్వాలి. ఈవిషయం ఆర్షవిజ్ఞానులకూ, మంత్రశాస్త్రవేత్తలకూ సువిదితమైనదే. కాని నరసింహకవి "విమానపశ్చాద్భాగంబునఁ బ్రాకారమధ్యంబున సుదర్శనమును లక్ష్మియు సర్వకామంబుల నిచ్చుచుండు." (నార. 95. పు. 493 వ.) అని పేర్కొని లక్ష్మీమాతతో పాటు సుదర్శనం సైతం సర్వకామాలను ప్రసాదిస్తుందని నూతనవిషయాన్ని తెలియచేశాడు.

గతంలో విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుల సత్వరజస్తమోగుణాల గురించి కొంత చర్చించడం జరిగింది. కాని నరసింహకవి నారదీయపురాణ ప్రథమాశ్వాసంలో అర్జునుడు సుభద్రను తీసుకొని వెడలిన తరువాత మునీశ్వరులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్ష చేసి, వారి గుణాలను తెలుసుకొనవలసిందిగా భృగుమహర్షిని పంపగా ఆ మహర్షి ముగ్గురినీ పరీక్షించి, చివరికి మహావిష్ణువు మాత్రమే శుద్ధసత్వమూర్తి అని మునులకు చెప్పినట్లు పేర్కొన్నాడు (నార. 71, 72, పు. 429 వ 430, 431. ప. 432. వ.) మహావిష్ణువును శుద్ధసత్వమూర్తిగా పేర్కొనడంలో విశేషం లేదు కాని, మునులు భృగుమహర్షి ద్వారా త్రిమూర్తులను పరీక్ష చేయించారనడం విశిష్టమైన విషయం. గతంలో నారదపర్వతులు విష్ణువును శపించిన విషయం గుర్తించాం కాని త్రిమూర్తుల శక్తిస్వభావాలను మునులు పరీక్షించారన్న విషయం మాత్రం యీ సందర్భంలో మనం గుర్తించవలసిన విశేషం.