పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

493


నామహామునులను నర్ఘ్యపాద్యములఁ
బ్రేమతోఁ బూజించి పెంపగ్గలించి
వారిచేఁ గథలెల్ల వలనొప్ప వినుచు
ధారుణీనాథుండు తమ్ములుఁ దాను
సుఖమున్న యెడల, నస్తోకవైఖరుల
నఖిలగుణోపేతుఁడగు నారదుండు
వచ్చిన, నెదు రేఁగి వడిఁదెచ్చి పూజ
లిచ్చి యాసనమున నెంతయు నునుప,
వారలఁ గుశలంబు వరుసతోనడిగి
నారదుఁ డాధర్మనందనుకనియె:

నారదుఁడు ధర్మరాజుని పరిపాలనావిషయములడుగుట

"మీవంశనృపతుల మెలకువయందుఁ
బావనమతిఁ జరింపంగనేఱుతువె!
ధర్మంబుదప్పక దయ చాలఁగలిగి
ధర్మకోవిదులను దయఁబ్రోతువయ్య?
మహినిఁ గామ క్రోధ మదలోభములును
సహజ మత్సర మోహ సన్నాహములును
బొరయవుగద! నీతి బుద్ధినూహింతె?
పరరాజ భేదనోపాయంబుఁ దలఁతె?
యపరరాత్రంబులయందుఁ జింతింతె
యుపమచేయఁగరాని యుచితకృత్యములు?
పృథుకీర్తులైన మీపెద్దలసాటి
బుధుల మంత్రుల విప్రపుంజంబుఁ బ్రోతె?
నిజమంత్రములు ధారుణీనాథులకును
విజయమూలంబులు; వివరింప నీవు
రక్షింపుదువె సుస్థిరంబుగా వాని
నీక్షితి జనులెల్ల నెఱుఁగకుండఁగను;