పుట:తెలుగు వాక్యం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

తెలుగు వాక్యం


(197)

a. సుజాత సుబ్బారావుతో "నువ్వు మా యింటికి రా" అన్నది.
b. సుజాత(సుజ్బారావుతో) సుబ్బారావును తన ఇంటికి రమ్మన్నది.

ఇందులో జరిగిన మార్పులివి : 1. పరోక్ష విధిలో విధిక్రియకు కారాగమం జరిగింది. రా + మ్ .> రమ్మ్ 2. ఆనుకృత వాక్యంలో కర్తకు ప్రధాన వాక్యంలో అముఖ్యకర్మ ఆదేశం అయింది. 3. కర్తృపదంగా గ్రహించినది. ప్రథమపురుష నామం గనక మా -కు తన అనే శబ్దం ఆదేశమయింది. 4. కర్తృపదం గ్రహించిన సుబ్బారావు అనే నామానికి ద్వితీయా విభక్తి చేరింది.

3.51 : వీటిల్లో మొదటి మూడు మార్పులూ ఇంతకు ముందు విపులంగా చర్చించినవే. కాకపోతే అక్కడ క్రియావిభక్తి సంధాన సూత్రప్రవర్తన ప్రధాన విషయం కనక సర్వనామ పరివర్తనం గురించి మాత్రమే పేర్కొనబడింది. క్రియావిభక్తులు సర్వనామాలమీదనే ఆధారపడి ఉండటం భాషా సామాన్య లక్షణం. అయితే ఈ పరివర్తనలో సర్వనామాలకు సర్వనామాలే ఆదేశం కావాలనే నియమం లేదు. కర్తృ అముఖ్యకర్మ స్థానాల్లో ఏనామం ఉంటే ఆనామమే సూత్రంలో పేర్కొన్న ప్రకారం ఆదేశమవుతుంది. అసలు చిక్కు నాలుగో మార్పుదగ్గరే. ద్వితీయా విభక్తి కర్మార్థంలో నామానికి చేరుతుంది. ఫై వాక్యంలో 'సుబ్బారావు'ను కర్మగా భావిస్తే 'అన్నది' అనే క్రియకే భావించాలి. అనుకృతవాక్యం (గర్భ వాక్యం=embedded sentence) లో కర్తృపదం ప్రధాన వాక్యం (గర్భివాక్యం = matrix sentence) లో కర్మపదంగా జరిగిందనాలి. దీన్ని తెలుగులో కర్త్రుద్ధరణ సూత్రానికి (subject raising) ఉదాహరణగా భద్రిరాజు కృష్ణమూర్తిగారు భావిస్తున్నారు. గర్భవాక్యంలో కర్త గర్భివాక్యంలో కర్మస్థానానికి ఎగరటం కర్త్రుద్ధరణ. ఇట్లా కర్మస్థానానికి ఎగరటం వల్లనే పై వాక్యంలో ద్వితీయావిభక్తి చేరిందని దీనిభావం. కాని ఈ ప్రతిపాదనకి తగినంత బలం లేదు. అను ధాతు నిష్పన్న క్రియకు మనుష్య వాచక నామాన్ని ముఖ్యకర్మగా వాడినప్పుడు నిందార్థమే స్ఫురిస్తుంది. (చూ. వాక్యం. 194a). కాని (197) b లో ఆ అర్థం లేదు. అర్థభేదాన్ని నిర్లక్ష్యం చేసినా చిక్కు తొలగదు. ఉదాహరణకి ఈ కింది వాక్యం చూడండి.

(198)

a. సుజాత సుబ్బారావుకు “నువ్వు మా యింటికి రా" అని చెప్పింది.
b. సుజాత (సుబ్బారావుకు) సుబ్బారావును తన ఇంటికి రమ్మని చెప్పింది.