పుట:తెలుగు వాక్యం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయము

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశపు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పములో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయటయేగాక, ప్రపంచములోని వివిధ దేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్ 12 (తెలుగు ఉగాది) మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది. అందుకు ఒక ఆహ్వానసంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావుగారు దాని కార్యనిర్వాహకాధ్యక్షులు. ఆర్థికమంత్రి మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్యక్రమాల సమన్వయసంఘాల అధ్యక్షులు.

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్ర భాషా, సాహిత్య, కళా, చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 మంది సభ్యులుకల ఒక విద్వత్‌సంఘమును, శ్రీ నూకల నరోత్తమరెడ్డిగారి అధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్‌సంఘము ఆ లఘు గ్రంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆయారంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యెన్నుకొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా, సాహిత్య, చారిత్రక విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వహింప