ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0102-06 భైరవి సం: 02-012 వైరాగ్య చింత
పల్లవి: అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు
చ. 1: చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు
చ. 2: పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు
చ. 3: యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు