ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0380-03 శుద్ధవసంతం సం: 04-466 నృసింహ
పల్లవి:
చేకొన్న భక్తుల పాలి చింతామణి
సాకారమై వున్నాఁడు సర్వేశ్వరుడు
చ. 1:
వాఁడిగోళ్లచేత వడి హిరణ్యునిఁ జంపి
వేడుక నెత్తురు లెల్ల వెదచల్లుచు
పోఁడిమి నరసింహుఁడై పొడచూపె నల్లవాఁడె
మూఁడు మూర్తులకును మూల మీతఁడు
చ. 2:
కొండమీఁదఁ గూచుండి కోప ముపసంహరించి
అండనున్నదేవతల కభయమిచ్చి
మెండుగ సులభుఁడై మెరయుచు నున్నవాఁడు
దండి జగముల కెల్ల దైవ మీతఁడు
చ. 3:
వేవేలు చేతులను వెస నాయుధాలు వట్టి
చేవ మీరి ప్రతాపాన సిరులు మించి
యీవల నహోబలాన నిరవై యున్నవాఁడు
శ్రీ వేంకటాద్రి మీఁది సిద్ధమూర్తి యీతఁడు