రేకు: 0344-03 పళవంజరం సం: 04-258 కృష్ణ
పల్లవి : |
వెఱపించబోయి తానె వెఱచెఁ దల్లి యశోద
మఱచి యీబాలు నెట్టు మానిసెంటా నుండెనో
|
|
చ. 1: |
వెంట రాకుమని కృష్ణు వెరపించి యశోద
వొంటి మందలో గొంగ వున్నాఁడనె
అంటి గొంగ యెందునున్నాఁడని నోరు దెరచితే
పెంటలై బ్రహ్మాండాలు పెక్కు గానవచ్చెను
|
|
చ. 2: |
చందమామఁ బాడి తల్లి సరిఁ బొత్తుకు రమ్మంటే
చందురుఁ జూచి కృష్ణుఁడు సన్నపేసెను
ముందరఁ జంద్రుఁడు వచ్చి మొక్కితే యశోద చూచి
ముందేలా యంటినో యని ముంచి వెరగందెను
|
|
చ. 3: |
పాలార్చి తొట్టెలలోఁ బండఁబెట్టి యశోద
నీలవర్ణుఁ దొంగిచూచె నిద్దురో యని
వోలి శంఖచక్రాలతో నురము శ్రీసతితోడ
యీలీల శ్రీవేంకటేశుఁడై యున్నాఁడు
|
|