పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

బోధశరీరుఁ జేరి తనబొందిన నుండు మహాత్ముఁ గాంచి, బల్
సాధుల సేవఁ జేయుచును, జాలఁగ నింద్రియకాంక్ష మానుచున్,
మాధవు నాత్మ నెన్నుచును మన్న విభుం డటు మర్త్యకోటిపైఁ
గ్రోధముఁ నిల్పఁబోఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

83

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! సుజ్ఞానియైన గురువర్యుణ్ణి సమీపించి, ఆ మహనీయుని ఉపదేశాన్ని పాటించి, తనలో నెలకొనివున్న ఆత్మస్వరూపుణ్ణి దర్శించి, అనంతరం లోకంలోని సాధు, సజ్జనుల సేవలు చేస్తూ, సమస్తజ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల కాంక్షలను నిగ్రహించుకొంటూ, భగవానుణ్ణి నిత్యమూ మనస్సులో ధ్యానిస్తూ, సాటిమానవులపై కోపగించుకోనట్టి మనుజుడు సర్వశ్రేష్ఠుడు. (అలాంటి మానవుడు 'జీవన్ముక్తుడు'గా పరిగణింపబడుతుంటాడనేది సారాంశం).