పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మనుజులు మందబుద్ధిఁ జని మానవనాథుల నాశ్రయించుచున్
ఒనరఁగఁ దర్శవాదముల నూరక చేసి, ధనంబుఁ దెచ్చి, యా
తనయుల కంచు గొందులను దాఁతురు లోభముచేత నేర్పడన్,
గొనకొననీదు ముక్తి; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

65

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! దయచేసి ఈ మానవస్వభావాన్ని చిత్తగించు! కొందరు విద్యావంతులయిన మనుజులు బుద్ధిమాంద్యంతో రాజులను ఆశ్రయించి, వాళ్ల సభలలో శాస్త్రవాదాలు సలిపి, ఆ రాజులను మెప్పించి, వాళ్లు బహూకరించిన ధనాన్ని తెచ్చి, (తామనుభవింపక), తమ తనయులకొఱకని యుద్దేశించి, పిసినిగొట్టులై మార్మూలప్రదేశాల్లో భూమియందు దాచిపెట్టుతుంటారు. అల్లాగ ద్రవ్యంపై దురాశ అనే దుర్గుణం అలాంటి పండితుల్లో కూడా ముక్తిని గూర్చిన ఆలోచనను కలుగనీయదు కదా!