పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ముందటి దోవ గానకను, మూర్ఖులునై బలు జవ్వనంబునన్
సుందరులైన భామినులఁ జూచి మనంబు నపేక్షసేయఁగా,
నిందలు సేయుచున్, పరుల నేరము లెన్నఁగఁ దాము బుద్ధిలోఁ
గుందుచు నుందురయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

101

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! మూర్ఖజనులు కొందరు భవిష్యత్తులో తాము నడుచుకొనదగిన సన్మార్గాన్ని తెలిసికోలేనివారై, సుందరీమణులగు యువతులను గాంచి మనస్సులో కోరుకొంటూవుంటారు. ఆ యువతీమణులపై నిందలను సృష్టిస్తూవుంటారు. అలాగే ఎల్లవేళలా ఇతరులదోషాలను ఎన్నడంలోనే కాలం గడపుతూ, మలినబుద్ధులై, మనశ్శాంతి లేనివారై యుంటారు.

(అలాంటి కలుషితబుద్ధులను ఉద్ధరించగల్గిన ఉత్తమసదుపాయం తరిగొండ లక్ష్మీనృసింహుని యందలి భక్తి ఒక్కటే - అనేది సందేశసారాంశం).