పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

బొందియె శాశ్వతం బనుచు
బోరున రొక్కముఁ గూర్చు లోభినిన్
పొందుగ నూరిలోఁ గినిసి 'భోజుఁడ'వంచును భట్లు వేడినన్,
'ఎందుకు వీరు వచ్చి? రిది యేమి మహాప్రళయం?' బటంచు బల్
గొందుల దూరునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

92

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఇపుడు లోభియైన మనుజుని స్వభావాన్ని నివేదిస్తున్నాను, చిత్తగించు! లోభివాడు ఈ శరీరమే స్థిరమైనదని విశ్వసించి దండిగా ధనాన్ని సమకూర్చుకొంటాడు. అలాంటి పిసినిగొట్టును కవిత చెప్పుతూ పద్యాల్లో ప్రశంసించే భట్టులు సమీపించి, 'దానగుణంలో మీరు భోజమహారాజులాంటి వారు!'- అని ప్రార్ధింపగా, 'నేను ఊళ్లో ఉండగా కొంపలు మునిగిపోయేంత ప్రళయంలాగా ఇప్పుడే వీళ్లెందుకు దాపురించినా రబ్బా?' అని అనుకొంటూ వాళ్లకు కనిపించకుండా శీఘ్రంగా సందుల్లో, గొందుల్లో దాగుకొంటాడు. (లోభివాని స్వభావం ఇందులో అత్యంత సహజంగా ఆవిష్కరింపబడింది.)