పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పట్టుగ నీశ్వరుండు తనపాలిటనుం డిపు డిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలన చేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్,
గుట్టుగ లక్ష్మిఁ బొందుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

91

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! వివేకం గల మానవుడు తనకు భగవంతుడు ప్రసాదించినంతలో అంగవికలురు, అనాథలు, నిరుపేదలు అయిన దీనజనులను కసరుకొనక, ఆప్యాయతతో లాలిస్తూ వాళ్లకు అన్నం పెడుతుంటాడు. ఆ విధంగా అన్నదానం కొనసాగిస్తూ, తన మనస్సులో ప్రశాంతతను పెంపొందించుకొంటూ, నిమ్మళంగా నివసిస్తుంటాడు. అట్లు నెమ్మదితో అన్నదానం కావించే ఆ సజ్జనుణ్ణి సంపదలకు అధిదేవతయైన శ్రీమహాలక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా (ఏలాటి ఆడంబరమూ, ప్రచారమూ లేకుండానే) వచ్చి వరిస్తుంది. (అతని యింటిలో నెలకొంటుందని అభిప్రాయం.) (దీనులకు నిరాడంబరంగా కావించే అన్నదానానికి ఇంతటి మహిమ కలదని తాత్పర్యం.)